Vaccine News: దేశంలో కరోనా సెకెండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోపక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇప్పటి వరకు 45 ఏళ్లు మించిన వారికి సైతం మొదటి డోస్ టీకా ఇవ్వడం పూర్తి కాలేదు. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి కూడా టీకాలేస్తామన్నారు. కానీ, అది ఇప్పుడిప్పుడే సాధ్యమయ్యేలా లేదు. ఈ సమయంలో ఒక అధ్యయనం ప్రభుత్వానికి కాస్త ఉపశమనం ఇచ్చేలా ఉంది.
Vaccine News: ఎంత గ్యాప్ ఉంటే అంతమంచిదట!
మార్చి నెలలో లాన్సెట్లో ఓ అధ్యయనాన్ని ప్రచురించారు. దాని ప్రకారం కొవిషీల్డ్ వ్యాక్సిన్ను 12 వారాల తర్వాత తీసుకుంటే సామర్థ్యం 81.3 శాతంగా ఉన్నట్లు గుర్తించారు. అదే ఆరు వారాలలోపు తీసుకుంటే మాత్రం 55.1 శాతం సామర్థ్యం మాత్రమే ఉందని పరిశోధకులు వెల్లడించారు.ఇక బ్రిటన్, బ్రెజిల్లలో జరిగిన చివరి దశ ట్రయల్స్లో వ్యాక్సిన్ సామర్థ్యం 90 శాతం దాకా ఉంటున్నట్లు తేలింది. అలా జరగాలంటే ముందు సగం డోసు ఇచ్చి, నెల తర్వాత మొత్తం డోసు ఇవ్వాల్సి ఉంటుందని ఈ ట్రయల్స్ తేల్చాయి. ఇక ఇప్పటికే యూకేలో రెండు డోసుల మధ్య విరామం 12 వారాలుంటే, కెనడాలో 16 వారాల విరామం తర్వాత వేస్తున్నారు. రెండో డోసుల మధ్య ఎక్కువ సమయం ఉంటే మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు నిపుణులు చెబుతుండడమే దీనికి కారణం.
కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఈ అధ్యయనం!
మన దగ్గర ఇప్పుడు వ్యాక్సిన్కు డిమాండ్ పెరిగింది. దీంతో కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియాలోనూ గ్యాప్ ఎక్కువ ఇచ్చేలా ప్లాన్ చేస్తే వ్యాక్సిన్ల కొరతను కాస్తయినా అధిగమించే వీలుంటుంది. రెండో డోసు తీసుకునే వాళ్లు మరికొంత ఎక్కువ కాలం వేచి ఉండాల్సి రావడంతో ఆ మేరకు మరికొంత మందికి తొలి డోసు వేసే అవకాశం దక్కుతుంది. ఇలా వ్యాక్సిన్ల కొరతకు కాస్త చెక్ పెట్టవచ్చని అంటున్నారు.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలిసారి వచ్చినప్పుడు రెండో డోసును 4 నుంచి 6 వారాల మధ్య తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత ఏప్రిల్లో ఆ విరామాన్ని ఆరు నుంచి ఎనిమిది వారాలుగా నిర్ధారించారు. ఆ గ్యాప్ ఉంటే.. వ్యాక్సిన్ మరింత మెరుగ్గా పని చేస్తుందంటూ కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు ఆ సమయాన్ని మరింత పెంచే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. ఈలోపు ఈ కొత్త అధ్యయనం బయటకొచ్చింది.దీన్ని కూడా పరిశీలించి ఈ వారంలోనే కేంద్రం ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి