రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నిన్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగ వ్యవస్థను కించపరిచే విధంగా మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు చేశారంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురువారం ఉదయం తన ఫిర్యాదును రాజ్భవన్కు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. తన పట్ల, ఎన్నికల సంఘం పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారని నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఉద్యోగులను కూడా రెచ్చగొట్టే విధంగా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయనీ, రాజ్యంగ వ్యవస్థ అయిన ఎన్నికల సంఘంపై మంత్రి కొడాలి నాని విమర్శలు చేయడం ఇదే ప్రధమం కాదనీ గతంలోనూ ఇదే విధంగా వ్యాఖ్యలు చేశారని నిమ్మగడ్డ తెలిపారు. నాని మీడియా సమావేశంలో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్లను, పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్లను సైతం గవర్నర్కు పంపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందించడం లేదని, మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ గవర్నర్ను కోరారు.
మరో పక్క నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్నకు సీఎస్ అనుమతులు ఇవ్వకపోవడంతో రెండు సార్లు రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలుత బుధవారం మధ్యాహం ఎస్ఈసీ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని భావించారు. అధికారులకు సీఎస్ నుండి అనుమతులు వెళ్లకపోవడంతో రద్దు చేశారు. మళ్లీ గురువారం ఉదయం 11గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినా సీఎస్ నుండి జిల్లా కలెక్టర్లకు అనుమతులు లేకపోవడంతో రెండవ సారి వీడియో కాన్ఫరెన్స్ రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ ఫిర్యాదుపై గవర్నర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తకాదు. తిరుమల డిక్లరేషన్ వివాద సమయంలో ఏకంగా ప్రధాన మంత్రి మోడీ, యుపి సీఎం ఆదిత్యనాధ్ ల పేర్లును కూడా ఉటంకించి బీజేపీని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు మంత్రి కొడాలి నానిని బూతుల మంత్రి అని కూడా పిలుస్తుంటారు. నాని తాజాగా నిమ్మగడ్డపై ఎమ్మన్నారంటే.. ”నిమ్మగడ్డ చంద్రబాబు ఏజంట్గా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఎన్నికలు సిద్ధంగా లేదని స్పష్టం చేస్తున్నా నిమ్మగడ్డ చంద్రబాబు కోసం ఎన్నికలు పెట్టాలనుకుంటున్నాడు. నిమ్మగడ్డ పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలి, రాజ్యంగ పదవిలో మరో నాలుగైదు నెలలు ఉండి హుందాగా తప్పుకుంటే మంచిది. నిమ్మగడ్డకు దమ్ము ధైర్యం ఉంటే రిటైర్ కావడంతో టీడీపీ తరుపున పోటీ చేస్తే వైసీపీ దమ్ము ఏమిటో చూపిస్తాం” అని కొడాలి వ్యాఖ్యానించారు.