ప్రస్తుతం కరోనా కొట్టిన దెబ్బతో దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైపోయిందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రభావం గరిష్టంగా రెండేళ్ల పాటు ఉంటుందని ఆర్ధిక నిపుణులు చెబుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జాగ్రత్తల పేరుమీద పథకాలు ఆపేసే పరిస్థితికి వచ్చింది! ఈ పరిస్థితుల్లో తాజాగా కేంద్ర ఆర్ధిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. “ఇకపై కేంద్రం నుంచి కొత్త పధకాలు ఏవీ ఉండవు. కనీసం ఒక ఏడాది పాటు ఇదే నిషేధం కొనసాగుతుంది” అని క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో రాష్ట్రాలనుంచి కొత్త ప్రతిపాదనలు కూడా ప్రస్తుతానికి ఏమీ పంపొద్దని సూచించారు. మరి ఈ పరిస్థితుల్లో ఏపీ పరిస్థితి ఏమిటి?
కేంద్రప్రభుత్వమే ఇలా చేతులెత్తేసి కొత్త పధకాలు వద్దు అంటోన్న సమయంలో… ఏపీ పరిస్థితి ఏమిటి? నిర్మలా సీతారమన్ ప్రకటన చూస్తే.. ఇక ఏపీకి కేంద్రం నుంచి వచ్చే సాయంపై ఇప్పట్లో ఆశలు పెట్టుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో సంక్షేమ పథకాల విషయంలో దూకుపోతున్న ఏపీ సర్కార్ కి ఇది మామూలు అగ్నిపరీక్ష కాదు. ఎందుకంటే… సుమారు ఆరేళ్ళుగా స్థిరమైన ఆదాయం లేని ఏపీ… బడ్జెట్ మొత్తంలో సంక్షేమానికి నూటికి ఎనభై రూపాయలు ఖర్చు చేస్తున్న పరిస్థితి. మరి ఈ విషయంలో జగన్ సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది!
అయితే… పరిస్థితులు ఎలా ఉన్నా సంక్షేమం విషయంలో, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించే విషయంలో జగన్ తగ్గరనే అంటున్నారు వైకాపా నాయకులు! ఇప్పటికే చెప్పినవీ, చెప్పనివీ అన్నీ కలుపుకుని అనేక హామీలు తీర్చేసిన జగన్… తొలి ఏడాదిలోనే యాభైవేల కోట్ల రూపాయలు నేరుగా జనాల ఖాతాల్లో వేసిన పరిస్థితి. ఈ క్రమంలో ఇది ఇలానే కొనసాగితే చాలా ఇబ్బందే అనేవారున్నారు. దీన్ని ఇలా కొనసాగించినా పర్లేదు కానీ… కనీసం కొత్త పథకాలు అయినా ప్రవేశపెట్టకుండా కొంతకాలం ఆగాలని మరో విన్నపం. మరి ఈ విషయంలో జగన్ ఈ మాటలు వింటారా? చూడాలి మరి!