జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాజకీయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు తెరమీదకు వస్తున్నాయి.
గత కొద్దికాలంగా, ఆయన వివిధ అంశాలపై తన వైఖరిని వెల్లడిస్తున్నారు. అయితే, దేశవ్యాప్తంగా కలకలం కొనసాగుతున్న అంశంపై మాత్రం ఆయన వైఖరి చర్చనీయాంశంగా మారింది. హాథ్రస్ హత్యాచార ఘటనను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా నిరసన కొనసాగుతున్న తరుణంలో, సీబీఐ విచారణను మాత్రం స్వాగతించింది.
దేశమంతా ఆందోళనే…
యూపీలోని హత్రాస్లో దళిత యువతిపై దారుణంగా అత్యాచారం జరిగింది. హత్రాస్ జిల్లాలో 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగక ఆమె నాలుక కోసి చిత్రహింసలకు గురిచేశారు. దీంతో రెండు వారాలపాటు మృత్యువుతో పోరాడిన ఆమె మరణించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సామూహిక అత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా పలు పార్టీలు దేశ రాజధానిలో ధర్నాలకు పిలుపునిచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో 114 సెక్షన్ విధించారు. ఒకవేళ ఎలాంటి నిరసనలకైనా అనుమతులు ఉంటే ఇండియా గేట్కు 3 కి.మీ. దూరంలోని జంతర్మంతర్ వద్ద నిర్వహించుకోవాలని, వంద మందికంటే ఎక్కువ మంది గుమికూడడానికి వీళ్లేదని స్పష్టం చేశారు. ఇండియాగేట్ పరిసరాల్లో ఎట్టి పరిస్థితుల్లో గుమికూడ కూడదని, అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
దిగివచ్చిన యూపీ సర్కారు
హాత్రస్ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ఎస్పీ, డీఎస్పీ సహా ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. అంతేకాకుండా సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే, ఈ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ పార్టీ ఆసక్తికరంగా స్పందించింది. హత్రాస్ కేసులో సి.బి.ఐ.దర్యాప్తు సరైన నిర్ణయం అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ లోని హథ్రాస్ లో జరిగిన పైశాచిక అత్యాచార కేసు దర్యాప్తును సి.బి.ఐ.కి అప్పగించడం ద్వారా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సరైన నిర్ణయం తీసుకున్నారని జనసేన పార్టీ భావిస్తోంది అని తెలిపారు. సి.బి.ఐ. విచారణ ద్వారా దోషులకు శిక్షపడుతుందని జనసేన విశ్వసిస్తోంది అని పేర్కొన్నారు. ఆడబిడ్డలపై అత్యాచారాలు జరిగినప్పుడు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గళం విప్పాలని జనసేన అది నుంచి కోరుకుంటోందని జనసేన పార్టీ పేర్కొంది. ఆడపిల్లల జీవితాలకు ఈ సమాజం భరోసా ఇవ్వాలి. వారు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలతో జీవించే విధంగా ప్రభుత్వాలు గట్టి చర్యలు చేపట్టాలి. అని డిమాండ్ చేశారు.
ఆడబిడ్డల విషయంలో…..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలుకి చెందిన సుగాలి ప్రీతి అనే బాలిక కేసులో జనసేన ముందుండి న్యాయం కోసం పోరాడుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమేనని నాదెండ్ల మనోహర్ అన్నారు. కర్నూలులో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జరిపిన భారీ కవాతు కారణంగా ఈ కేసును సి.బి.ఐ.కి అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు. అయితే ఇంతవరకు సి.బి.ఐ. నుంచి ఈ కేసుపై అధికారిక ప్రకటన విడుదల కాలేదని, ఈ విషయంలో జగన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాదెండ్ల మనోహర్ కోరారు. “సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయంపై వై.ఎస్.ఆర్.పార్టీ ఎం.పి.లు పార్లమెంట్ లో మాట్లాడాలి. అదేవిధంగా శాసనసభలో కూడా చర్చ జరగాలని జాతీయ మీడియా కూడా ఈ కేసుకు తగినంత ప్రాధాన్యత ఇచ్చి దోషులకు శిక్షపడేలా కృషి చేయాలని జనసేన విజ్ఞప్తి చేస్తోంది.“ అని కోరారు.