సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా సంక్షేమం దిశగానూ.. రాజకీయంగా ప్రత్యర్ధులను ఇరుకున పెట్టే విధంగా ఉంటుంది. ప్రస్తుతం కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల హామీలతోపాటు కొత్త హామీలను కూడా నెరవేరుస్తున్నారు. జగన్ అమలు చేస్తున్న ఓ హామీని ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా అమలు చేయడం సంచలనంగా మారింది. ఎన్నికల హామీల్లో నిరుద్యోగులకు జగన్ ఇచ్చిన ఆ హామీ.. దానివల్ల ఒరిగే ప్రయోజనాలేంటి అనే వివరాల్లోకి వెళ్తే..
మోదీ ప్రభుత్వం తాజా నిర్ణయం ఏంటంటే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఒక దేశం.. ఒకే పరీక్ష అనే రీతిలో ‘కామన్ ఎంట్రన్స్ టెస్ట్’ నిర్వహించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిక్ష నిర్వహణ కోసం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఏ) అనే కొత్త సంస్థను కూడా ఏర్పాటు చేసింది. దీనికి యూపీఎస్సీ తరహాలో స్వయం ప్రతిపత్తి ఇవ్వబోతున్నారు. దీని పరిధిలోకి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 20 నియామక సంస్థలను తీసుకొస్తారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కనీసం ఒకటి చొప్పున మొత్తం వెయ్యికి పైగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఏటా రెండుసార్లు పరీక్షలు నిర్వహించడం ద్వారా సాధించే స్కోర్ మూడేళ్ల పాటు చెల్లుబాటవుతుంది. స్కోర్ కోసం అభ్యర్థులు మళ్లీ మళ్లీ పరీక్షలు రాయొచ్చు. ప్రస్తుతం 12 భాషల్లోనే పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలను మాత్రం అన్ని భారతీయ భాషల్లో నిర్వహిస్తారు. అన్ని పరీక్షలకు ఒకేసారి నమోదు చేసుకోవడం.. వేర్వేరుగా ఫీజులు కట్టనవసరం లేకపోవడం.. సిలబస్ ఒకటే ఉండడం.. వంటి ప్రయోజనాలున్నాయి. ఆన్ లైన్లోనే సొంత జిల్లాలోనే పరీక్ష రాసుకోవచ్చు కూడా.
జగన్ ఎప్పుడు హామీ ఇచ్చారంటే..
పాదయాత్ర సందర్భంలో నిరుద్యోగులను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ.. ఉద్యోగాల కోసం ఎన్నో ఫీజులు కడుతున్నారు. నిరుద్యోగ భృతి రూపంలో టీడీపీ ప్రభుత్వం ఇస్తున్న నిరుద్యోగ భృతి ఈ ఫీజులకు, కామన్ ఎంట్రన్స్ టెస్టులకే సరిపోతుందని అప్పటి ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇందుకు తాను అధికారంలోకి వచ్చాక అన్నింటికీ కలిపి ఒకే విధానం తీసుకొస్తామన్నారు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏ పరీక్షకైనా హాజరుకావొచ్చు అని జగన్ హామీ ఇచ్చారు. దీనినే ఇప్పుడు మోదీ అమలు చేయడం విశేషం. ఈ ఆలోచన మోదీకి మొదటి నుంచీ ఉందా.. జగన్ ఇచ్చిన హామీ కేంద్రానికి చేరి ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది.