దేశ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి ఇంకా వ్యాక్సిన్ రాలేదు. రష్యా కరోనా వ్యాక్సిన్ విడుదల చేసినట్లు ప్రకటించినా దానిపై అనేక రకాలుగా అనుమానాలు వస్తున్నాయి. క్లినికల్ ట్రయల్స్ పై పారదర్సకత లోపించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్ చెప్పారు.
74వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా శనివారం ఎర్రకోటపై జాతీయ జెండా ఎగుర వేసిన అనంతరం మోడీ కరోనా వ్యాక్సిన్ గురించి మాట్లాడారు. దేశంలో మూడు వ్యాక్సిన్ లు వివిధ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయని చెప్పిన మోడీ శాస్త్రవేత్తలు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన వెంటనే సాధ్యమైనంత తక్కువ సమయంలోనే దేశ ప్రజలు అందరికీ చేరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు. వ్యాక్సిన్ ఎప్పుడు విడుదల అవుతుందనేది మోడీ స్పష్టంగా చెప్పకపోయినా త్వరలో వస్తుందని ప్రజలు అశాభావం వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా నేటి వరకు 25,26,192 పాజిటివ్ కేసులు నమోదు కాగా 49,036 మంది మృతి చెందారు. 18,08,936 మంది చికిత్స అనంతరం కోలుకొని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ కాగా, 6,68,220 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కేసుల సంఖ్య విపరీతంగా పెరగడం ఆందోళన కల్గిస్తున్నా కేసుల రికవరీ శాతం ఎక్కువగా ఉండటం, మరణాల రేటు తక్కువగా ఉండటం ఊరట నిస్తున్నది.