(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
కరోనా బారిన పడి గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న సినీనటుడు రాజశేఖర్ నేడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. రాజశేఖర్ కరోనా నుండి కోలుకుని చైర్ లో కూర్చున్న ఫోటోను ఆయన సతీమణి జీవితా రాజశేఖర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
తొలుత రాజశేఖర్తో పాటు జీవిత, వారి ఇద్దరు పిల్లలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. హోమ్ క్వారంటైన్ చికిత్సలోనే ఇద్దరు కుమార్తెలకు కరోనా తగ్గిపోగా, రాజశేఖర్, జీవితలు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. గత నెల 24వ తేదీన జీవితకు కరోనా నెగిటివ్ రిపోర్టు రావడంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో సిటీ న్యూరో సెంటర్లోనే ఐసీయులో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తల నేపథ్యంలో జీవిత రాజశేఖర్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై వీడియో సందేశం ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందనీ, త్వరలో కోలుకుంటారని జీవిత తెలియజేశారు. రాజశేఖర్ కరోనా నుండి పూర్తిగా కోలుకోవడంతో సోమవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది.