RRR: ఈ నెల ఇరవై ఆరో తేదీన ముఖ్యమంత్రి జగన్ భవితవ్యం తేలిపోతుందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్టంరాజు పేర్కొన్నారు.ఏపీ చరిత్రలో జూలై 26వ తేదీ ఒక ప్రత్యేక దినంగా నమోదు కాగలదని ఆయన వ్యాఖ్యానించారు.జగన్ బెయిల్ రద్దుపై తాను వేసిన పిటిషన్ మీద ఆ రోజు తప్పనిసరిగా న్యాయస్థానం నిర్ణయం వెలువడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ మీద బుధవారం విచారణ జరిగింది.అయితే కౌంటర్ దాఖలు చేయడానికి సీబీఐ పదిరోజులు గడువు కోరిన మీదట తదుపరి విచారణ ఈనెల ఇరవై ఆరోతేదీకి వాయిదా పడింది.దీనిపై స్పందిస్తూ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు.
RRR: ఆర్ ఆర్ ఆర్ ఏం చెప్పారంటే?
నిజానికి ఈ రోజే కోర్టు నిర్ణయం వెలువడుతుందని తాను భావించానని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.ఎనిమిదవ తేదీన విచారణ సందర్భంగా సిబిఐ ఏ నివేదిక ఇవ్వలేదని, కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని పేర్కొందన్నారు.అయితే ఈ రోజు విచారణ సందర్భంగా సీబీఐ కౌంటర్ దాఖలు చేయడానికి ముందుకు రావడం, పది రోజుల గడువు కోరడం జరిగిందన్నారు.తన తరపు న్యాయవాది వెంకటేష్ సిబిఐ వాదనలను వ్యతిరేకించారని, అయితే న్యాయస్థానం గడువు ఇవ్వాలని నిర్ణయించిందని ఆయన చెప్పారు.కౌంటర్ దాఖలు చేస్తామని సీబీఐ అధికారులు చెప్పడాన్ని స్వాగతించదగ్గదని అన్నారు. బెయిల్ మంజూరు చేయడానికి తాము వ్యతిరేకం కాదని వారు స్పష్టం చేశారని చెప్పారు.ఈ కేసు విచారణలో ఇదొక కీలక అంశం కాగలదన్నారు.26వ తేదీ నాడు సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేసినా, చేయకపోయినా అదే చివరిరోజు అవుతుందని పునరుద్ఘాటించారు. వైఎస్ జగన్ బెయిల్ రద్దు విషయంలో న్యాయం జరుగుతుందనే అనుకుంటున్నానని ఆయన చెప్పారు.
వైసిపి నేతలపై సెటైర్లు!
ఇక తనపై అనర్హత వేటు వేసే విషయంలో అవసరమైతే పార్లమెంటును స్తంభింపజేస్తామని వైసిపి నాయకులు హెచ్చరించడాన్ని రఘురామకృష్టంరాజు ఎగతాళి చేశారు.వారు కొత్తగా స్తంభన విద్య నేర్చుకొంటున్నారేమో నని సెటైర్ విసిరారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం నిధులపై పార్లమెంట్ను ఇప్పటిదాకా స్తంభింపజేయలేదని, అలాంటిది తన విషయంలో ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు.వైసీపీ స్పీకర్ కార్యాలయాన్ని డిక్టేట్ చేయాలని చూడటం సబబు కాదన్నారు.వైసిపి కోరగానే తనపై స్పీకర్ వేటు వేయాలా అని ఆయన ప్రశ్నించారు.తనపై మూడు వందల పేజీల నివేదికను స్పీకర్ కి సమర్పించానని చెప్పిన పార్టీ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ పై కూడా రఘురామకృష్ణంరాజు చురకలు వేశారు.మార్గాని భరత్ ముఖ్యమంత్రి జగన్ మనసు దోచుకున్న నాయకుడని ఆయన వ్యంగ్యంగా అన్నారు.ఏం జరుగుతుందో మీరే చూస్తారుగా అని రఘురామకృష్ణంరాజు అనడం కొసమెరుపు.