హైదరాబాద్: తెలంగాణ ఆర్టిసి కార్మికులు 27 రోజులుగా సమ్మెలో ఉండటం బాధాకరమైన విషయం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అశ్వత్థామరెడ్డి నేతృత్వంలో ఆర్టిసి కార్మిక సంఘాల జెఎసి నేతలు నేడు బంజారాహిల్స్లోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ను కలిశారు. సమ్మెకు మద్దతుగా నిలవాలని కోరారు. కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్ను కలుస్తాననీ, ఆయనపై తనకు నమ్మకం ఉందని పవన్ చెప్పారు. ఒక వేళ కెసిఆర్ అపాయింట్మెంట్ లభించకపోతే కార్మికుల భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటానని పవన్ వారికి హామీ ఇచ్చారు. కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.