YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీసమేతంగా రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను సోమవారం రాజ్ భవన్లో కలుసుకోవడం మీద కొత్త కొత్త కథనాలు, ఊహాగానాలు ఊపందుకున్నాయి.ఇవన్నీ టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా వ్యాప్తిలోకి తెస్తున్నాయి.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భార్య భారతి తో కలిసి గవర్నర్ ని కలుసుకోవడం మీద ఆయావర్గాలు ఫోకస్ పెట్టాయి. చాలా ముందు చూపుతో జగన్ తన సతీమణి భారతిని గవర్నర్ కి పరిచయం చేశారని,దీని వెనుక పెద్ద నేపథ్యం ఉందని ఆ వర్గాలు కథనాలు వండేస్తున్నాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే?
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ కి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ న్యాయ పోరాటం చేస్తుండటం తెలిసిందే. విచారణ చేపట్టిన హైకోర్టు జులై ఒకటో తేదీకి ఈ కేసును వాయిదా వేయటం విదితమే.దీన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో భారీ స్థాయిలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సీఎం జగన్ బెయిల్ రద్దు కావడం తథ్యమని,ఆయన మళ్ళీ జైలుకెళ్లటం ఖాయమని ఒక ప్రచారం మొదలైంది.ఇదే జరిగితే తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న విషయమై కూడా వదంతులు రేగాయి. జగన్ సతీమణి భారతి లేదా తల్లి వైయస్ విజయమ్మ సీఎం పీఠం ఎక్కుతారని ఒక కథనం,సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేదా బొత్స సత్యనారాయణ కూడా సీఎం కావడానికి ప్రయత్నిస్తారని మరో కథనం వినవచ్చాయి.జగన్ జైలు కెళితే ఈ ఇద్దరు మంత్రులు పార్టీని చీల్చి అయినా సరే తమ అభీష్టం నెరవేర్చుకుంటారన్నది ఒక వర్గం కోడై కూస్తోంది.వీటన్నిటికీ పరాకాష్టగా గవర్నర్ ని సీఎం కలిశాక మరో ప్రచారం ఉధృతమైంది.
ఇదండీ తాజా తాజా ప్రచారం!
సోమవారం ముఖ్యమంత్రి రాజ్ భవన్లో గవర్నర్ దంపతులను కలిశారు.ప్రధానంగా ఆయన నామినేటెడ్ ఎమ్మెల్సీల నియామకం విషయంలోనే గవర్నర్ తో మాట్లాడి ఆయనకు కొందరి విషయంలో క్లారిటీ ఇచ్చారన్నది వాస్తవం. గవర్నర్ ని సీఎంకలిసి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీల నియామకాలకు రాజ్ భవన్ ఆమోదం తెలపడం ఇందుకు నిదర్శనం.కానీ ఇందుకు పూర్తి విరుద్దమైన కథనం బయటకు వచ్చింది.గవర్నర్ ను సతీసమేతంగా కలిసిన సీఎం జగన్ ఈ సందర్భంగా భార్య భారతిని ఆయనకు పరిచయం చేయడమే కాకుండా తాను జైలుకెళితే ఆమె తదుపరి ముఖ్యమంత్రి అని కూడా విశ్వభూషణ్ కి చెప్పేశారని గోబెల్స్ ప్రచారం మొదలైపోయింది.ఆమెకు సహకారం ఇవ్వాలని సీఎం తనదైన శైలిలో గవర్నర్ ని కోరినట్లు ఒక సెక్షన్ కోడై కూస్తోంది.ఇప్పటికే తాడేపల్లిలో భారతి పాలనా వ్యవహారాల్లోనూ, పార్టీ పర్యవేక్షణపైనా శిక్షణ పొందుతున్నారని,ఆమెను సీఎం చేయడానికి జగన్ ఫిక్స్ అయిపోయారని,గవర్నర్ దగ్గర కూడా తన మనసులో మాట ఆయన బయట పెట్టారని ఆ వర్గాలు వదంతులు వ్యాప్తి చేస్తున్నాయి.లోగుట్టు మాత్రం పెరుమాళ్లకే ఎరుక!