తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కేసిఆర్ ప్రాంతీయ వాదం వదిలివేసి జాతీయ వాదం ఎత్తుకుని టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ భారత రాష్ట్రీయ సమితిగా మార్పు చేసిన సంగతి సంగతే. బీఆర్ఎస్ పార్టీని దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విస్తరించేందుకు కేసీఆర్ సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో అనూహ్యంగా ఏపిలోని వైసీపీ సమైక్య వాదం తెరపైకి రావడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏపి ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికీ, ఎప్పటికీ ఉమ్మడి రాష్ట్రమే మా విధానమని వ్యాఖ్యానించడం తీవ్ర సంచలనం అయ్యింది. సజ్జల వ్యాఖ్యలను తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు తీవ్రంగా ఖండిస్తుండగా, జాతీయ పార్టీ అధినేతగా మారిన తెలంగాణ సీఎం కేసిఆర్ గానీ, మంత్రి కేటీఆర్ గానీ సజ్జల వ్యాఖ్యలపై నోరు మెదకపోవడం, అధికారికంగా టీఆర్ఎస్ పార్టీ సజ్జల వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటన విడుదల చేయకపోవడంపై ఆసక్తికరంగా మారుతోంది. సజ్జల వ్యాఖ్యలను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెంటనే ఖండించారు.
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అయిపోయి రెండు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు పరిపాలనలు సాగిస్తుండగా, సజ్జల చేసిన వ్యాఖ్యలు ఊహాజనితం, అసాధ్యమైనవి అయినప్పటికీ తెలంగాణలో మళ్లీ సెంటిమెంట్ ను రాజేసేందుకు దోహదపడతాయని అంటున్నారు. వాస్తావనికి రాష్ట్రాల విభజన జరగాలన్నా, కలపాలన్నా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే అందుకు అనుగుణమైన బిల్లును ఉభయ సభల్లో ఆమోదం పొందితేనే సాధ్యమవుతుంది. సజ్జల ఈ రకమైన వ్యాఖ్యలు అయితే చేసారు గానీ అసెంబ్లీలో ఆ మేరకు తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపుతామని అనలేదు. ఒక వేళ ఏపి ప్రభుత్వం ఆ మేరకు తీర్మానం చేసినా టీఆర్ఎస్ సర్కార్ కూడా ఏపిని తెలంగాణలో విలీనం చేయడానికి అభ్యంతరం లేదని ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇప్పటికే ఒక పర్యాయం కర్నూలు రాజధానిగా ఉన్న ఆంధ్రను తెలంగాణలో విలీనం చేసి గతంలో సమైక్యాంధ్ర చేయడం వల్ల ప్రత్యేక ఆంధ్రా, ప్రత్యేక తెలంగాణ, గ్రేటర్ రాయలసీమ ఉద్యమాలు జరిగాయి.
ఇప్పుడు ఏపిని మళ్లీ తెలంగాణలో కలిపితే తమకు అభ్యంతరం లేదని వైసీపీ చెప్పడం ద్వారా ఎటువంటి సందేశం.? ఎటువంటి సంకేతం..? ఇవ్వాలనుకుంటుంది అనే దానిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఓ పక్క మూడు రాజధానుల విధానానికి కట్టుబడి ఉన్నామని, విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి తీరుతామని ప్రకటనలు ఇస్తూనే ఆ వాదనలకు భిన్నంగా సమైక్య రాగం ఎత్తుకోవడంలో ఆంతర్యం ఏమిటనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. దీనికి తోడు సజ్జల వ్యాఖ్యలపై అధికారికంగా టీఆర్ఎస్ నుండి కౌంటర్ రాకపోవడంతో గమనార్హం. కేసిఆర్ ఇక ప్రాంతీయ వాదాన్ని వీడి జాతీయ వాదం ఎత్తుకోవడమే కారణమా..? లేక ఈ రోజు జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఏమైనా కామెంట్స్ చేస్తారా..? అనేది వేచి చూడాలి.
రాష్ట్రవిభన అంశంపై ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల సంచలన కామెంట్స్