ఆర్ధిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక లో నిరసనలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ప్రధాని రణిల్ విక్రమ సింఘే కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రధాని పదవికి రాజీమానా చేశారు. ఈ రోజు పెద్ద ఎత్తున నిరసనకారులు అధ్యక్షుడి నివాసాన్ని ముట్టడించిన సంగతి తెలిసిందే. దీంతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే పరారు అయినట్లు వార్తలు వెలువడ్డాయి. మరో పక్క ఆర్మీ కేంద్ర కార్యాలయానికి ముందస్తుగానే సైన్యం తరలించినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రధాని సింఘే రాజీనామా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. స్పీకర్ అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ముగిసిన తరువాత రణిల్ విక్రమ సింఘే తన రాజీనామాను ప్రకటించారు.
అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పదవులకు రాజీనామా చేయాలని విక్రమ సింఘే, గోటబాయలను పార్టీ నేతలు కోరిన నేపథ్యంలోనే విక్రమ సింఘే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన రాజీనామా నిర్ణయాన్ని విక్రమ సింఘే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దేశ ప్రజల భద్రత సహా ప్రభుత్వ కొనసాగింపునకు తాను ఈ రోజు పార్టీ నాయకుల ఉత్తమ సిఫార్సును అంగీకరిస్తూ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ద్వీపదేశం శ్రీలంకలో ఆందోళనలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మహేంద రాజపక్సే రాజీనామా చేసిన తర్వాత ఈ ఏడాది మే 12న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.
మరో పక్క ఆందోళనకారులు అధ్యక్షుడి నివాసంలోకి చొరబడి కిచెన్ లో వంట చేస్తున్న దృశ్యాలు, భవన ప్రాంగణంలోని స్విమ్మింగ్ ఫూల్ లో ఈత కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.