డ్రగ్స్ మాఫియా కేసులో మూడు నెలల క్రితం అరెస్టయి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న హీరోయిన్ రాగిణి ద్వివేది తీవ్ర అనారోగ్యానికి గురిఅవ్వడంతో ఆమెను ఓ ప్రైవేటు హాస్పిటల్ కి తరలించారు.
గతంలో రాగిణి ద్వివేది తరపు న్యాయవాదులు ఆమెకు కోర్టులో ఎదురవుతున్న ఎదురు దెబ్బలతో నిరంతరం ఆందోళన చెందుతూ అనారోగ్యం బారిన పడ్డారని ఆమె ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందడానికి అవకాశం ఇవ్వాలని కోర్టును కోరారు. కానీ కోర్ట్ అందుకు అంగీకరించలేదు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో అన్ని సదుపాయాలతో ఆసుపత్రి ఉందని కావాలంటే అక్కడే చికిత్స పొందవచ్చని కోర్టు ఆమె తరపు న్యాయవాదులకు సూచించింది.
బయట నుంచి భోజనం తెప్పించుకోవడానికి నటి రాగిణి ప్రయత్నించగా బయట కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో అందుకు సెంట్రల్ జైలు అధికారులు అనుమతించలేదు.
తాజాగా నటి రాగిణి ఊపిరి ఆడకపోవడం మరియు కడుపునొప్పితో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకు వెంటనే సెంట్రల్ జైలులోని ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయినా ఆరోగ్యం కుదుట పడకపోవడంతో అక్కడ నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని సెంట్రల్ జైలులోని వైద్యులు సూచించారు. దీంతో ఆమెను నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం ఏమనగా రాగిణికి బెయిల్ మంజూరవుతుందా? లేదా? అని. ప్రస్తుతం ఇది ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు ఇచ్చే నివేదిక మీదనే ఆధారపడి ఉంది. రాగిణి ద్వివేదికి షరతులతో కూడిన జామీను మంజూరు చెయ్యాలని ఆమె న్యాయవాది అజ్మల్ పాషా కోర్టును ఆశ్రయించడానికి సిద్దం అవుతున్నారని తాజా సమాచారం.
అప్పటిలో ఈ డ్రగ్స్ మాఫియా కేసులో రాగిణి తరువాత మరో నటి సంజనా గల్రానీ కూడా అరెస్ట్ అయ్యారు కనే ఆమె బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కనే సంజనా కంటే ముందే రాగిణి ఆరెస్టు అయిన ఆమెకు మాత్రం ఇంత వరకు బెయిల్ రాలేదు.