తెలంగాణ బీజెపి అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ జగిత్యాల పర్యటన ఉద్రిక్తంగా మారింది. బండి సంజయ్ పర్యటనలో టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలు తెలపడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కేంద్రంలోని ఎన్ డీ ఏ ప్రభుత్వం నుండి గ్రామ పంచాయతీలకు రావాల్సిన రూ.1,024 కోట్లు విడుదల చేయించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన తెలిపారు.
జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని సర్పంచ్లతో పాటు కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొనడంతో జగిత్యాల థరూర్ బ్రిడ్జిపై గందరగోళం నెలకొంది. నేతల నిరసన ప్రదర్శనకు జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మద్దతు తెలిపారు. సర్పంచ్లతో కలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా నిరసనలో పాల్గొన్నారు. తమ పర్యటనలో నిరసన తెలియజేస్తున్న టీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
బండి సంజయ్ పర్యటన, టీఆర్ఎస్ కార్యకర్తల నిరసనల నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు నిరసనకారులతో పాటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో టిఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసులకు తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. తన పర్యటనలో టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలపడంపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.