‘జగనన్న ప్రభుత్వం కడుతున్నది కేవలం ఇళ్లు కాదు… అవి ఊళ్లు’.. జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీకి ఇచ్చుకున్న స్లోగన్ ఇది. ఇందులో చాలా నిజం ఉంది. పేదల పక్షపాతిగా సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకం కాబోతుంది. అన్ని ఇళ్లు.. అందులో ఉండే ప్రజానీకంతో అక్కడ నిజంగా ఊరే అవుతుంది. ప్రజల జీవనం కూడా పెరుగుతుంది. చిరు వ్యాపారాలు పెరుగుతాయి. ఫలితంగా ప్రజలకు గూడుతో పాటు ఉపాధిని కూడా ఇచ్చినట్టవుతోంది. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ‘అతి తక్కువ సమయంలోనే మంచి ముఖ్యమంత్రిగా మీచేత అనిపించుకుంటాను’ అన్నారు జగన్. ఈరోజు ఇళ్ల పట్టాల పంపిణీతో వేయబోతున్న అడుగుతో ఆ మాట నిజం కానుందని చెప్పాలి.
పేదలకు ఇల్లు.. సాకారమవుతోందిలా..
ఎవరికైనా ‘ఇల్లు’ ఓ కల. ఇల్లుంటే ఒక భరోసా. అదే పేదలకు ఇవ్వనున్నారు సీఎం జగన్. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఇళ్ల పండగ స్వతంత్ర భారతావని చరిత్రలో ఏ రాష్ట్రం, ఏ ముఖ్యమంత్రి కూడా చేయనిది. ఒకేసారి 30.75 లక్షల మందికి ఇళ్ళ స్థలాలిచ్చే కార్యక్రమం నభూతో నభవిష్యతి అని చెప్పాలి. ఇందుకు తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామం వేదిక కానుంది. ఇక్కడి నుంచే జగన్ పేదవారి ఇళ్లలో వెలుగు కానున్నారు. డిసెంబర్ 26 నుంచి జనవరి 7వరకూ జరిగే ఈ కార్యక్రమంలో 15.60 లక్షల ఇళ్ల శంకుస్థాపనలు కూడా ఉండటం గొప్ప విషయం. జన్మభూమి కమిటీల తీరుకు భిన్నంగా లబ్దిదారుల పేర్లు గ్రామ-సచివాలయ బోర్డుల్లో ఉంచడం ద్వారా పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నారు.
చాలా పెద్ద సాహసమే.. కానీ ధైర్యంగా..
మొత్తం 68,361 ఎకరాలు.. మొత్తంగా 30.70 లక్షల మంది లబ్దిదారులు.. 50,940 కోట్ల అంచనా వ్యయం.. (17,004 వైఎస్సార్ కాలనీలతో కలిపి) మార్కెట్ విలువ 23,535 కోట్లు.. ఇవన్నీ జగన్ నిబద్ధతకు, ధైర్యానికి ప్రతీకలు. పైగా గతంలో పేదలకు ఏ ప్రభుత్వం ఇళ్లు ఇచ్చినా బీఫాం పట్టాలు మాత్రమే ఇచ్చేవారు. కానీ.. ఇప్పుడు ఏకంగా పక్కా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం మరో చారిత్రక అంశం. వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ పర్వదినాన పేదల మనసుల్లో చెరగని ముద్ర వేసేందుకు సీఎం జగన్ ముందడుగు వేస్తున్నారు.
జగన్ ముందున్న సవాళ్లు..
అయితే.. జగన్ ప్రమాణ స్వీకారం రోజున తెలంగాణ సీఎం కేసీఆర్.. ‘వయసు చిన్నది.. బాధ్యత పెద్దది’ అని సీఎం జగన్ ను ఉద్దేశించి అన్నారు. అందుకు తగ్గట్టుగానే చాల పెద్ద బాధ్యత తీసుకున్నారు జగన్. ప్రభుత్వ ఖజానాపై చాలా పెద్ద భారమే పెట్టుకున్న జగన్ దీనిని సాకారం చేయడానికి పెద్ద కసరత్తే చేయాలి. ఇప్పటికే సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ పోలవరం ప్రాజెక్టు, సంక్షేమ పథకాలతో పాటు ఇప్పుడు ఇళ్లు కార్యక్రమం కూడా పెట్టుకున్నారు. వీటన్నింటినీ మోయటం తలకు మించిన భారమే కాదు.. చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. కేంద్రంతో సాన్నిహిత్యం, పెట్టుబడులు ఆకర్షించడం, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించడం. ముఖ్యమంత్రిగా ఇప్పటికే జగన్ మంచి మార్కులు సాధించి ముందుకెళ్తున్నారు. ఇదే లక్ష్యంతో ముందుకెళ్తే పైవేమీ పెద్ద సమస్యలు కాబోవు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?