Supreme Court: టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.
జస్టిస్ బేల ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన ధర్మాసనం పిటిషన్ పై విచారణ జరపగా కౌంటర్ దాఖలునకు నాలుగు వారాల గడువు కావాలని చంద్రబాబు తరపు న్యాయవాది హరీశ్ సాల్వే కోరారు. ఫిబ్రవరి 9వ తేదీకి విచారణ వాయిదా వేయాలని అభ్యర్ధించారు. ఫిబ్రవరి 9వ తేదీ తనకు మరో పని ఉందని ఏపీ ప్రభుత్వ న్యాయవాది రంజిత్ కుమార్ ధర్మాసనానికి తెలిపారు. అయితే ఫిబ్రవరి 12నకు వాయిదా వేయాలని హరీశ్ సాల్వే విజ్ఞప్తి చేయగా, ధర్మాసనం అంగీకరించింది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు తొలుత అక్టోబర్ 31న ఆరోగ్య పరమైన సమస్యల దృష్ట్యా తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత బెయిల్ ను రెగ్యులర్ బెయిల్ గా మారుస్తూ నవంబర్ 20న ఆదేశాలు ఇచ్చింది. అయితే .. బెయిల్ పై ఏపీ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బెయిల్ ఇచ్చే విషయంలో హైకోర్టు తన పరిధిని మీరిందని పేర్కొంటూ ఆ మరునాడే సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ వేసింది. ఎస్ఎల్పీలో ప్రతివాదిగా చంద్రబాబును చేర్చింది. ఈ ఎస్ఎల్పీ తేలేంత వరకూ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది.
హైకోర్టు స్కిల్ కుంభకోణంలో సీఐడీ చేసిన ఆరోపణల పూర్వాపరాల్లోకి వెళ్లి చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిందని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు తేల్చిన పలు అంశాలు వాస్తవ విరుద్దంగా ఉన్నాయని పేర్కొంది. ట్రయల్ సందర్భంగా కింది కోర్టును ప్రభావితం చేసేలా హైకోర్టు తీర్పు ఉందనీ, బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఏకంగా 39 పేజీల తీర్పు వెలువరించిందని వివరించింది.
బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు మినీ ట్రయల్ నిర్వహించిందన్నారు. రికార్డుల్లో ఉన్న అంశాలకు విరుద్దంగా హైకోర్టు తన నిర్ణయాన్ని వెలువరించిందన్నారు. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంలో కేసు లోతుల్లోకి వెళ్లకూడదన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్దంగా హైకోర్టు వ్యవహరించిందని ఎస్ఎల్పీలో పేర్కొంది. హైకోర్టు చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను డిశార్జ్ పిటిషన్ ను విచారించినట్లు విచారించిందన్నారు. స్కిల్ కుంభకోణం కేసు లోతుల్లోకి వెళ్లి మరీ చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిందన్నారు.
Supreme Court: విశాఖ రామానాయుడు భూముల వ్యవహారంపై సుప్రీం స్టే ఉత్తర్వులు