Supreme Court: విశాఖ రామానాయుడు భూముల వ్యవహారంలో సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. విశాఖలో రామానాయుడు స్టూడియో భూములను లే అవుట్ వేసి విక్రయించడంపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతివాదులకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. 2003 సెప్టెంబర్ 13న ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్న అవసరాలకు మినహా ఎలాంటి కార్యకలాపాలకు ఈ భూములను ఉగయోగించకూడదని స్పష్టం చేసింది.
విశాఖలో 2003లో రామానాయుడు స్టూడియోకు సినీ అవసరాలకు వినియోగించేందుకు గానూ నాటి ప్రభుత్వం 35 ఎకరాల భూమి కేటాయించింది. అయితే స్టూడియోకు కేటాయించిన భూమిని కోస్టల్ నిబంధనలకు విరుద్దంగా లే అవుట్ చేసి ఇతర కార్యకలాపాలకు వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆదేశాలను విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతివాదులకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా హైకోర్టు పిటిషన్ కొట్టివేయడాన్ని రామకృష్ణబాబు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. భూమిని ఎందుకు కేటాయించారు..? ప్రస్తుతం లే అవుట్ వేశారా..? కార్యకలాపాలు చేపట్టారా..? అని పిటిషన్ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.
సినీ స్టూడియో నిర్మాణానికి భూములు కేటాయించారనీ, అందుకు అనుగుణంగా అక్కడ ఎలాంటి పనులు చేపట్టకుండా లే అవుట్ వేసి అమ్మకాలకు సిద్దం చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ధర్మాసనం .. ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధిస్తూ .. ఈ ఏడాది మార్చి 11 లోపు స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది.
Ayodhya Ram Mandir: అయోధ్యలో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు..!