ఢిల్లీ, జనవరి 16: సిబిఐ తాత్కాలిక డైరెక్టర్గా ఎం నాగేశ్వరరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై వచ్చే వారం విచారణ చేపట్టేందుకు సుప్రీం అంగీకరించింది. సిపిఐ డైరెక్టర్గా ఉన్న అలోక్వర్మను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి సంఘం తొలగించి, నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించింది. ఇది సరికాదని కామన్ కాజ్ అనే స్వచ్చంద సంస్థ ప్రతినిధులతో పాటు సమాచార హక్కు చట్టం కార్యకర్త అంజలి భరద్వాజ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిలతో కూడిన ఉన్నత స్థాయి సంఘం సిబిఐ డైరెక్టర్ను నియమించాల్సి ఉందని, ఆ నిబంధనను పాటించలేదని వారి తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. సిబిఐ డైరెక్టర్ నియామానికి సంబంధించి అన్ని పత్రాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా కేంద్రాన్ని ఆదేశించాలని కూడా ఆయన కోరారు.