హైదరాబాద్: ‘మేఘా’ ప్రణాళికతోనే కెసిఆర్ ఆర్టిసిని ప్రైవేటీకరించేందుకు పథక రచన చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపి రేవంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టిఎస్ ఆర్టిసి నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమని పేర్కొన్నారు. పన్నుల భారాన్ని తగ్గించి ఆర్టిసిని కాపాడుకోవచ్చని రేవంత్ సూచించారు.
డీజిల్పై పన్నులతో ఆర్టిసి కోలుకోలేకపోతోందనీ, దీనిపై వ్యాట్ తగ్గిస్తే ఆర్టిసికి ఏడాదికి 700 కోట్ల రూపాయల లాభం వస్తుందనీ రేవంత్ అన్నారు. స్పేర్ పార్ట్స్పై 150 కోట్ల రూపాయల పన్నులు విధిస్తుందని రేవంత్ చెప్పారు. బస్ పాస్ రాయితీలకు సంబంధించి ప్రభుత్వం ఆర్టిసికి 700 కోట్ల రూపాయలు బాకీ పడిందని రేవంత్ అన్నారు. ఆర్టిసి నస్టాలను తగ్గిచేందుకు ఆలోచన చేయకుండా ప్రైవేటీకరించాలని చూస్తున్నారని రేవంత్ విమర్శించారు. ఆర్టిసిని ప్రైవేటీకరించాలన్న ఆలోచన కెసిఆర్కు ఇప్పటికిప్పుడు వచ్చింది కాదని రేవంత్ అన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీ కోసమే ఆర్టిసిని ప్రైవేటీకరించాలన్న ఆలోచన వచ్చిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.