చెన్నై, మార్చి 8 : భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్కు అత్యున్నత సైనిక పురస్కారమైన పరమవీర్చక్ర అవార్డు ప్రదానం చేయాలని తమిళనాడు సిఎం పళనిస్వామి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో శత్రు సేనలకు చిక్కినా మొక్కవోని ధైర్యం, సంయమనం పాటించిన ఐఏఎఫ్ పైలట్ అభినందన్కు అత్యున్నత సైనిక పురస్కారం అందించడం సముచితమని ప్రధానికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.
ఫిబ్రవరి 27న పాకిస్తాన్కు చెందిన యుద్ధ విమానాలు భారత్ గగనతలంలోకి చొరబడ్డాయి. వాటిని భారత వాయుసేన విమానాలు వెంబడించాయి. మిగ్-21 యుద్ధ విమానంతో అభినందన్ పాకిస్తాన్ ఫైటర్ జెట్ F-16ని కూల్చేసి శత్రువులను తరిమికొట్టాడు. ఆ క్రమంలో తాను నడుపుతున్న మిగ్-21 విమానం కూడా కూలిపోయింది. అభినందన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పడిపోయాడు. పాక్ ఆర్మీకి చిక్కాడు. అంతర్జాతీయ సమాజం నుంచి ఎదురైన ఒత్తిడితో రెండు రోజుల తరువాత పాక్ అభినందన్ ను భారత్ కు అప్పగించింది. అభినందన్ ధైర్య సాహసాలపై దేశ ప్రజలు ప్రశంసలు కురిపించారు.
అభినందన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి కావటంతో ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రధాని మోదీకి లేఖ రాశారు. 1983 జూన్ 21న భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఎయిర్ మార్షల్ సింహకుట్టి వర్థమాన్కు అభినందన్ జన్మించాడు. అభినందన్ తల్లి డాక్టర్, తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో యుద్ధ విమానాల పైలట్గా పనిచేశాడు. ప్రస్తుతం చెన్నైలో అభినందన్ కుటుంబం నివాసముంటున్నది.