విజయవాడ: తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం తరఫున మంత్రి అవంతి శ్రీనివాస్ అవార్డు తీసుకోవడం శోచనీయని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. గోదావరిలో పడవ ప్రమాదానికి కారణమైన మంత్రి అవంతి శ్రీనివాస్ పర్యాటకాభివృద్ధికి సంబంధించిన అవార్డు తీసుకోవడానికి సిగ్గుపడాలని విమర్శించారు. పడవ మునిగి దాదాపు 15 రోజులు అవుతున్నా బయటకు తీయకుండా రాజకీయ విమర్శలు చేయడం అవంతి దిగజారుడుతనానికి నిదర్శనం మండిపడ్డారు. వైసీపీ నాలుగు నెలల పాలనలో పర్యాటకంపై ఒక్కటంటే ఒక్క సమీక్ష గానీ, అభివృద్ధిగానీ చేయకుండా.. అవార్డు ఎలా వచ్చిందో, ఎవరు చేసిన కృషికి అవార్డు వచ్చిందో ఆలోచించుకోవాలన్నారు. నోరు తెరిస్తే అబద్దం మాట్లాడుతున్న అవంతి శ్రీనివాస్ ఇప్పుడు తీసుకున్న అవార్డుతో తెలుగుదేశం ప్రభుత్వ అభివృద్ధిని ఢిల్లీ సాక్షిగా ఒప్పుకున్నారని పేర్కొన్నారు.
టీడీపీ హయాంలో అభివృద్ధి జరగకపోతే.. ఇప్పుడు ఆయన శాఖ దేశంలోనే నెంబర్ వన్ అంటూ అవార్డు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తెలుగుదేశం హయాంలో పర్యాటకరంగంలో జరిగిన అభివృద్ధిని, మీ చేతగానితనాన్ని ఇప్పటికైనా ఒప్పుకోవాలని హితవు పలికారు. చేతకాని వారికే చేష్టలెక్కువ అన్నట్లు.. పర్యాటకానికి తెలుగుదేశం చొరవేంటో తెలుసు గనకే అవార్డుల స్వీకారం నాడు.. అధికారులు కనీసం అవార్డును ముట్టుకోనీయకుండా అడ్డుకున్నారని విమర్శించారు. నవ్వుతూ.. నమ్మించి మోసం చేయడంలో జగన్ను అవంతి మించిపోయారని ఆరోపించారు. విశాఖలో వాక్ స్వాతంత్రాన్ని హరిస్తూ అక్రమ కేసులు పెట్టడం మాని.. గోదావరిలో మునిగిన పడవను బయటకు తీయడంపై దృష్టి పెట్టాలని మంతెన సూచించారు.