అహ్మాదాబాద్: కొత్త చట్టం అమలులోకి వచ్చిన తరువాత భారీ జరిమానాలతో ప్రజలు భయపడుతున్నారు. తాజాగా అహ్మాదాబాద్ లో ఓ ఆటో డ్రైవర్ జరిమానా కట్టలేక ఆత్మహత్యాయత్నం చేశారు. అహ్మాదాబాద్ లో ఆటో నడిపే రాజు సోలంకి అనే వ్యక్తికి కొత్త చట్టం ప్రకారం పత్రాలు సరిగా లేని కారణంగా 18 వేల రూపాయల ఫైన్ వేశారు. అసలే ఆర్ధికంగా చితికిపోయిన రాజు, పోలీసులు విధించిన జరిమానా కట్టలేకపోయాడు. దీంతో పోలీసులు రాజు ఆటోను సీజ్ చేశారు. జీవనోపాధిగా ఉన్న ఆటో లేకపోవడంతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక ఆత్మహత్యాయత్నం చేశాడు. బీఏ వరకు చదువుకున్నా తనకు సరైన ఉద్యోగం దొరక్కపోవడంతో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నట్టు రాజు పేర్కొన్నాడు.
సెప్టెంబరు 1 నుంచి కొత్త మోటారు వాహనాల చట్టం అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి భారీ జరిమానా విధిస్తున్నారు. ఇటీవల గురుగ్రామ్లో ఓ ఆటోడ్రైవర్కి రూ.32,500 జరిమానా పడింది. ఆటోకి సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్,డ్రైవింగ్ లైసెన్స్,పొల్యూషన్ సర్టిఫికెట్,ఇన్సూరెన్స్ పేపర్స్ లేకపోవడంతో అతనికి భారీ మొత్తంలో జరిమానా పడింది. ఇక ఇదే గురుగ్రామ్లో మరో వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించినందుకు రూ.23వేలు జరిమానా పడింది. అయితే అతను నడుపుతున్న బండి రూ.15వేలకు మించి ఉండదు. దీంతో వాహనదారులు అన్ని రకాల పత్రాలు ఉన్నాయా లేదా అని చూసుకొని బయటకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఫిట్నెస్ సర్టిఫికెట్..ఇది లేకుంటే ఐదువేల రూపాయలు ఫైన్ కట్టాల్సిందే.