హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై కొనసాగుతున్న విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 15న వాయిదా వేసింది. దీనిపై గురువారం రెండు గంటల పాటు విచారణ కొనసాగింది. అన్ని వాదనలు విన్న హైకోర్టు… పూర్తి వివరాలతో మరోసారి కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 15న మరోసారి దీనిపై విచారణ చేపడతామని పేర్కొంది.
మరోవైపు ప్రజలు ఆర్టీసీ సమ్మె ద్వారా ఎదురవుతున్న కష్టాలు తొలగించేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బస్ పాస్లను అనుమతిస్తున్నారా ? లేదా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తాము సమస్యలు పరిష్కరించేలోపే కార్మికులు సమ్మెకు వెళ్లారని ప్రభుత్వం తరపున న్యాయవాది తమ వాదన వినిపించారు. సమ్మె కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇదిఇలా ఉంటే.. తాము నెల రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చామని… ప్రభుత్వం తమ నోటీసులకు స్పందించకపోవడం వల్లే సమ్మెకు వెళ్లామని ఆర్టీసీ కార్మిక సంఘాల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ నివేదిక అస్పష్టంగా ఉందని అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.