Telangana: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ మంత్రి ఒకరు తీవ్రస్థాయిలో ఫైర్ కావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఆ మంత్రి కూడా తెలంగాణ సిఎం కేసీఆర్ కి సన్నిహితుడు కావడంతో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సంబంధాలు బెడిశాయా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.ఒక ముఖ్యమంత్రిపై పొరుగు రాష్ట్ర మంత్రి ఒకరు ధ్వజమెత్తడంతో పాటు వార్నింగ్ ఇచ్చేటట్లు మాట్లాడటమనేది ఆషామాషీ విషయం కాదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.దీని వెనుక పెద్ద సారు హస్తం తప్పక ఉంటుందన్నది తెలంగాణ రాజకీయ పరిశీలకుల భావన.విషయానికొస్తే ..
జగన్ పై చెలరేగిన మంత్రి శ్రీనివాస్ గౌడ్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి దోపిడీకి పాల్పడుతోందని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో ఆరోపించారు.ఈ సందర్బంగా ఆయన సీఎం జగన్ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో ఏపీ సీఎం జగన్ది నిజమైన స్నేహం కాదన్నారు. జగన్ వైఖరి నోట్లో చక్కెర, కడుపులో కత్తెర అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.ఇదే సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పైనా ఆయన విసుర్లు విసిరారు.వైఎస్ కాలంలో రాజోలు బండ దగ్గర తూములు పగలకొట్టి నీళ్లు దోచుకుపోయారని గుర్తు చేశారు. అదే పంథాను ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డి కూడా అవలంబిస్తున్నారని అన్నారు.ఇప్పుడు తెలంగాణ నుండి జగన్ 80 వేల క్యూసెక్కులు తీసుకుపోతున్నారని ఆరోపించారు.గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను జగన్ ఉల్లంఘిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్రం అనుమతిలేకుండానే రాయలసీమ ప్రాజెక్టు పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాగైతే పాలమూరు ప్రజలు బ్రతుకొద్దా..వారికి నీళ్లోద్దా అని శ్రీనివాస్ గౌడ్ ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.
దౌర్జన్యాలు తిప్పికొడతాం!
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంతటితో ఆగలేదు. ఏపీ ప్రభుత్వానికి వార్నింగ్ కూడా ఇచ్చారు. తెలంగాణ ఎగువన ఉందని, ఏపీలో ఒకటి కడితే ఇక్కడా పది కడతామని ఆయన హెచ్చరించారు. పైనుంచి నీళ్లను మలుపు కోవడం తమకు తెలియదా అని ప్రశ్నించారు. దౌర్జన్యం చేస్తామంటే తాము ఊరుకోమని మంత్రి హెచ్చరించారు.ఈ స్థాయిలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడటం వెనుక తప్పనిసరిగా ఉన్నతస్థాయి ప్రోద్బలం ఉండే ఉంటుందన్నది సర్వత్రా వినిపిస్తున్న టాక్.మరి ఏపీ ప్రభుత్వం రియాక్షన్ ఎలా వుంటుందో చూడాలి.