రాష్ట్రంలో బీజేపీ-జనసేన బలం పుంజుకోవడం, ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుండటం వైసీపీ నేతలను కలవరపెడుతోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రభుత్వ ప్రాజెక్ట్ల విషయంలో భారీ సంఖ్యలో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంపై నిరుద్యోగులు, జీతాల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు, బిల్లుల అంశంపై కాంట్రాక్టర్లు కూడా వైసీపీకి వ్యతిరేకులుగా మారుతున్నారు.
వాటన్నింటినీ గమనించే వైసీపీ నేతలు ఈ లేని ధైర్యాన్ని కనబరుస్తున్నారని, వైసీసీ హయాంలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా రాలేదని, పెట్టుబడులు శూన్యంగా ఉన్నాయని, అప్పులు మాత్రం విపరీతంగా పెరిగా యని యువత ప్రశ్నిస్తున్నారు. అయితే అన్నింటినీ సంక్షేమ పథకాలు కవర్ చేస్తాయని.. పేదలంతా తమకే ఓటేస్తారని.. గట్టి నమ్మకంతో వైసీపీ నేతలు ఉన్నారు. వారిది నిజమైన నమ్మకమా.. మేకపోతు గాంభీర్యమా అన్నది ఎన్నికల తర్వాత కానీ తెలియదు.
బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని వైసీపీ అనుకుంది. దీనికి కారణం గత ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల తమకే ఎక్కువ లాభం కలిగిందని అంచనాకు రావడమే. అదే సమయంలో బీజేపీ అండ ఉంటే.. ఎన్నికల సంఘం చూసీ చూడనట్లుగా ఉంటుంది. అధికార పార్టీకి ఇది చాలా కీలకం.కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం గత ఎన్నికల్లో చంద్రబాబు సర్కార్ తో ఆడుకున్నట్లుగా ఆడుకుంటే మొదటికే మోసం వస్తుంది. అదే ఇప్పుడు గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంది.
పార్టీ అభ్యర్థుల విషయంలో సీఎం జగన్ ఇప్పటికే గందరగోళంలో ఉన్నారు. అటూ ఇటూ మార్పులు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అనూహ్యంగా మూడు పార్టీలు పొత్తులకు రెడీ కావడం.. వైసీ పీలో సహజంగానే గుబులుకు దారి తీస్తోంది. ఏ పార్టీకైనా ఎన్నికల సమయంలో చేసే పోల్ మేనేజ్మెంట్ కీలకం. దీనిపైనే ఇప్పుడు టీడీపీ-జనసేనలు టార్గెట్ చేశాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతుందో చూడాలి.