Tokyo Olympics 2021: భారత మహిళల హాకీ చరిత్రలో మొదటిసారి సెమీ ఫైనల్స్ చేరిన టీమిండియా ఎటువంటి పతకం లేకుండానే వెనుదిరిగారు. గ్రేట్ బ్రిటన్ తో జరిగిన పోరులో భారత్ అమ్మాయిలు పోరాడి ఓడారు కానీ అమ్మాయిలు చూపిన పోరాట పటిమ దేశం మొత్తాన్ని ఆకట్టుకుంది. పురుషుల లాగే అమ్మాయిలు కూడా సెమీఫైనల్స్లో ఓడిపోయి కాంస్య పతక పోరులో చాలా చక్కగా ఆడారు. అయితే ఎంతో అనుభవం కూడుకున్న దుర్భేద్యమైన గ్రేట్ బ్రిటన్ డిఫెన్స్ ను ఛేధించడంలో లో కొద్దిగా ఇబ్బంది పడ్డారు. అయితే బ్రిటన్ ని ఓడించినంత పనిచేశారు మన లేడీ చిరుతలు.
మ్యాచ్ మొదటి క్వార్టర్లో ఇరుజట్లు డిఫెన్స్ కే పరిమితం కావడంతో ఎటువంటి గోల్ నమోదు కాలేదు. అయితే రెండవ క్వార్టర్ మొదలైన కొద్ది సేపటికే వరుసగా బ్రిటన్ రెండు గోల్స్ చేసింది. అయితే మన అమ్మాయిలు కూడా అదేరీతిలో రెచ్చిపోయారు. దీంతో బ్రిటన్ స్కోరు 2-1 కి తగ్గింది. భారత్ కి గుర్జీత్ కౌర్ తొలి గోల్ అందించింది. ఆ తర్వాత టీమిండియాకు పెనాల్టీ కార్నర్ లభించడం… మళ్ళీ గుర్జీత్ తన నైపుణ్యంతో మరో గోల్ చేయడంతో భారత్ బ్రిటన్ స్కోర్ సమం చేసింది.
రెండవ క్వార్టర్ మరి కొద్దిసేపు ఉన్న సమయంలో భారత్ మరో గోల్ కొట్టింది. అలా భారత్ 3-2 తేడాతో ఆధిక్యంలో కి వెళ్ళింది. ఇక బ్రిటన్ ఎదురుదాడి మొదలుపెట్టింది. మధ్యలో భారత్ రెండు పెనాల్టీలు కోల్పోవడంతో బ్రిటన్ మరింత పుంజుకునే దాడులు జరిపింది. అయితే భారత్ మాత్రం కొద్దిగా కూడా బెదరలేదు. మూడో క్వార్టర్లో బ్రిటన్ దూకుడుగా మొదలెట్టింది. అలాగే ఓ గోల్ కూడా సాధించింది.
ఇక చివరికి క్వార్టర్ లో బ్రిటన్ కి పెనాల్టీ లభించినప్పటికీ భారత్ దానిని అడ్డుకుంది. అయితే వెంటనే బ్రిటన్ కు మరొక పెనాల్టీ రావడంతో భారత ఒత్తిడికి లోనైంది. దీంతో బ్రిటన్ గోల్ చేయడంతో 4-3 ఆధిక్యతకు వెళ్ళింది. మరో గోల్ తర్వాత భారత్ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఇక దేశానికి తొలి సారి మహిళల హాకీలో పతకం సాధించాలన్న అమ్మాయిల కల చెదిరింది. కానీ వారి పోరాటం మాత్రం తరాలను ప్రేరేపించేలా సాగింది.