తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి సోమవారం కొలువుదీరింది. టిటిడి నూతన పాలకమండలిలో 29 సభ్యులతో పాటు ఎడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారి ఆలయం గరుణాళ్వార్ సన్నిధిలో 50వ ధర్మకర్తల మండలి సభ్యులుగా 20 మంది సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. టిటిడి జెఇఒ బసంత్ కుమార్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.
జూన్ 22న టిడిపి చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టగా శనివారం ముగ్గురు, నేడు 20మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్, కమిషనర్ పద్మ, ఇఒ అనిల్ కుమార్ సింఘాల్ ప్రమాణం చేశారు.
అనంతరం అన్నమయ్య భవనంలో చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన తొలి పాలకవర్గ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుమలలో శాశ్వత ప్రాతిపదికన నీటి సమస్యను పరిష్కరించేందుకు బాలాజీ రిజర్వాయర్ నిర్మిస్తామని తెలిపారు. అవిరాల ట్యాంక్ అభివృద్ధికి కేటాయించిన నిధులను బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి మళ్లిస్తామని వైవి చెప్పారు. ఎపి రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఆలయానికి గత ప్రభుత్వం కేటాయించిన 150 కోట్ల రూపాయలను ప్రస్తుత అవసరాల మేరకు 36 కోట్ల రూపాయలకు కుదింపు చేసినట్లు ఆయన తెలిపారు. తిరుపతిని స్మార్ట్ సిటిగా ప్రకటించిన తర్వాత టిటిడి నిధులు కేటాయింపు చేయడం సరికాదని వైవి చెప్పారు. గరుడ వారధికి ప్రభుత్వంతో సంప్రదించిన అనంతరం నిధులు కేటాయిస్తామని వైవి తెలిపారు.
రమణదీక్షితులు వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున ఆ అంశంపై పాలకమండలిలో చర్చించలేదని వైవి వెల్లడించారు.
టిటిడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సబ్ కమిటిని నియమిస్తామని వైవి తెలిపారు.