పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషె మొహమ్మద్ నేత మసూద్ అజర్ను అంతర్జాతీయ టెరరిస్టుగా ప్రకటించడాన్ని పదేపదే అడ్డుకుంటున్న చైనా తాజా ప్రయత్నాన్ని కూడా చివరి నిముషంలో నిరోధించింది.
ఈ చర్య రెండు రకాల స్పందనలను తీసుకువచ్చింది. ఇటు ఇండియాలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించేందుకు దీనిని వినియోగించుకున్నారు. అటు అమెరికాలో చైనా చర్యపై అక్కడి దౌత్యాధికారులు చాలా ఘాటుగా స్పందించారు.
సమితి భద్రతా మండలిలో అమెరికా దౌత్యవేత్త ఒకరు దీనిపై మాట్లాడుతూ, చైనా ఇట్లాగే వ్యవహరిస్తే భద్రతామండలి సభ్యదేశాలు వేరే నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు అన్నారు. ఇది కొంచెం అసాధారణమైన స్పందన అనే చెప్పాలి.
చైనా చర్య ఆశాభంగం కలిగించిందని భారత ప్రభుత్వం పేర్కొన్నది. ముందుసారి చైనా ఈ పని చేసినపుడు ఇండియా ఇంకాస్త గట్టిగా స్పందించింది. నిరసన తెలిపింది. చైనా చర్య అర్ధంకాకుండా ఉందని వ్యాఖ్యానించింది. తాజా స్పందనపై రాహుల్ వ్యాఖ్యానిస్తూ బలహీన ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ అంటే భయమని అన్నారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తూ వచ్చిన చైనా విధానం ఎందుకూ పనికిరాదని ఆయన వ్యాఖ్యానించారు.
గత దశాబ్దంలో మసూద్ అజర్ను చైనా ఆదుకోవడం ఇది నాలుగవసారి. జైషె మొహమ్మద్ను ఐక్యరాజ్య సమితి 2001లోనే నిషేధించింది. అజర్ను సమితి అంతర్జాతీయ టెరరిస్టుగా ప్రకటించిన పక్షంలో అతని కదలికలపై ఆంక్షలు వస్తాయి. బ్యాంక్ ఖాతాలు స్థంభించిపోతాయి. ఆయుధాలు కొనుగోలు చేయడం కుదరదు.
మసూద్ అజర్పై తాజాగా సమితిలో వచ్చిన తీర్మానాన్ని అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్ తదితర దేశాలతో పాటు గతంలో ఎన్నడూ లేనన్ని సభ్యదేశాలు ప్రతిపాదించాయి. శాశ్వత సభ్యదేశంగా తనకున్న వీటో హక్కును ఉపయోగించి చైనా చివరి నిముషంలో తీర్మానం ఓటింగ్కు రాకుండా అడ్డుకుంది.