Chandrababu Naidu: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపించింది ఏపీ సీఐడీ. ఈ కేసులో నేరం నిరూపణ అయితే దాదాపు పదేళ్ల జైలు శిక్ష పడుతుందన్న టాక్ నడుస్తొంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్నారు.
ఈ తరుణంలోనే ఏపీ సీఐడీ ఆయనపై ఉన్న మరో కేసును ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ స్కామ్ కేసులో ఏ 1 నిందితుడుగా ఉన్న చంద్రబాబును విచారించాల్సి ఉందని పేర్కొంటూ పిటీ వారెంట్ పిటిషన్ ను కోర్టులో దాఖలు చేసింది ఏపీ సీఐడీ. ఈ పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు విషయంలో ఏపీ సీఐడీ చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెలుతున్నట్లు స్పష్టం
అవుతోందని అంటున్నారు. దీంతో ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ ఏమిటి అనే దానిపై చర్చ జరుగుతుంది. చంద్రబాబు హయాంలో కేవలం కాగితాలకే పరిమితం చేసి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పేరుతో దోపిడీకి పాల్పడ్డారంటూ గత ఏడాది ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. ఇన్నర్ రింగ్ రోడ్డ్ అలైన్ మెంట్ ను నచ్చినట్లుగా మార్చేశారనీ, దాని ఫలితంగా వేల కోట్ల రూపాయలు అనుయాయులకు లబ్ది చేకూర్చాలా చేశారన్నది అభియోగం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో ఇష్టం వచ్చినట్లుగా మార్పులు చేశారని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత ఏడాది మే నెలలో ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో చేసిన మార్పులు రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని అగ్రికల్చర్ ఫామ్స్, జయని ఎస్టేట్, ఎల్ ఈ పీఎల్ ప్రాజెక్ట్స్ కు లబ్ది కల్గించాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, నాటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఏ 1, ఏ 2 గా చేర్చారు. వీరితో పాటు మరి కొందరి పేర్లు కూడా చేర్చారు. వారిపై సెక్షన్ 420, 166, 34, 26, 37, 120 బీ కింద సీఐడీ కేసు నమోదు చేసింది.
ఈ రెండు కేసుల్లో నేరం నిరూపణ అయితే చంద్రబాబుకు పదేళ్లకుపైగా జైలు శిక్ష పడుతుందని అంటున్నారు వైసీపీ వర్గాలు. ఏపీ జైలులో చంద్రబాబు భద్రత లేదని భావిస్తున్నందున అత్యంత కట్టుదిట్ట భద్రతా చర్యలు ఉండే తీహార్ జైలుకు పంపడం ఖాయమని చంద్రబాబు వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు.