Twitter X: ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనతో ముడిపడిన ఖాతాలను సస్పెండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై ఎలన్ మస్క్ కు చెందిన ఎక్స్ అనూహ్యంగా స్పందించింది. తొలుత కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పలు ఖాతాలు, పోస్టులను గురువారం ఎక్స్ నిలిపివేసింది. అయితే ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూనే .. భావప్రకటన స్వేచ్చ ను సాకుగా చూపి ఇలాంటి పోస్టులను నిలిపివేయొద్దని తెలిపింది.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా .. దేశం (ఇండియా) లో మాత్రమే రైతుల నిరసనలకు సంబంధించిన ఖాతాలు, పోస్టులను నిలిపివేస్తాం కానీ ఈ చర్యలతో ఎక్స్ విభేదిస్తుందని పేర్కొంది. భావప్రకటన స్వేచ్చను విస్తరింపజేయాలని కోరుతున్నామని చెప్పింది. చట్టపరమైన పరిమితుల కారణంగా, ప్రభుత్వ ఉత్తర్వులను ప్రచురించలేకపోయామని, కానీ పారదర్శకతకు వాటిని పబ్లిక్ చేయడం చాలా అవసరమని చెప్పింది. లేకపోతే అది ఏకపక్ష నిర్ణయం తీసుకోవడానికి దారి తీస్తుందని స్పష్టం చేసింది.
కాగా, ఢిల్లీ చలో మార్చ్ కు సంబంధించి 177 ఖాతాల సస్పెండ్ చేయాలని ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, రెడ్డిట్, ఎక్స్ లకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ నెల 14న ఆదేశాలు జారీ చేసింది. ఈ ఖాతాలు అన్నింటినీ బ లాక్ చేయాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ఎక్స్ ఈ విధంగా ప్రకటన విడుదల చేయడం విశేషం.
మరో పక్క పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత, వ్యవసాయ రుణాల రద్దుతో సహా ఇతర డిమాండ్ లపై రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో రైతులు పోరుబాట కొనసాగిస్తున్నారు. పంజాబ్ – హరియాణా సరిహద్దులోని శంఖు, ఖనౌరీ బోర్డర్ పాయింట్లు రైతులు, పోలీసుల మధ్య ఘర్షణతో దద్దరిల్లాయి. భారీ సంఖ్యలో ట్రాక్టర్ ట్రాలీలు, మినీ వ్యాన్లు, జేసీబీలపై నిరసన కారులు తరలివచ్చారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Jahnavi Kandula: ఆమెరికాలో ఏపీ విద్యార్ధిని జాహ్నవి మృతికి కారణమైన పోలీసుకు క్లీన్ చిట్..?