రాజకీయ వ్యూహం పన్నడంలో తడబడినా పొరబడిన సదరు నాయకుడు వెనకబడిపోతాడు .ప్రస్తుతం కడప జిల్లా జమ్మలమడుగులో జరుగుతున్నది ఇదే. జమ్మలమడుగు రాజకీయాలంటే అందరికీ తెలిసిందే. అక్కడ ఇద్దరే ఇద్దరు నాయకులు చక్రం తిప్పారు.ఇద్దరికీ బలమైన గ్రూపులు ఉన్నాయి.ఇద్దరు మాజీ మంత్రులులే..ఎవరికి ఎవరూ తీసిపోరు.వారే రామసుబ్బారెడ్డి..
ఆదినారాయణరెడ్డి .అయితే రామసుబ్బారెడ్డి సరైన రాజకీయ పంథాను అనుసరించక పోవడంతో జమ్మల మడుగులో ఆయన ప్రాభవం తగ్గిపోయిందంటున్నారు. రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. మరో నేత ఆదినారాయణరెడ్డి మాత్రం బీజేపీలో చేరి తన వర్గాన్ని పటిష్టం చేసుకుంటున్నారు.ఒకే వరలో రెండు కత్తులు ఇమడవు అంటారు కానీ
2019 ఎన్నికలకు ముందు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిలు ఏకమయ్యారు. ఇద్దరి మధ్య చంద్రబాబు సయోధ్య కుదర్చడంతో రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు నియోజకవర్గం టిక్కెట్, ఆదినారాయణరెడ్డికి కడప ఎంపీ టిక్కెట్ లు దక్కాయి. అయితే ఇద్దరూ 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆదినారాయణరెడ్డి మరో మార్గం లేక బీజేపీ పంచన చేరారు . రామసుబ్బారెడ్డి మాత్రం టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు
అయితే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీజేపీలో ఉన్న ఆదినారాయణరెడ్డి తన వర్గాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. అప్పటి వరకూ టీడీపీ, వైసీపీల నుంచి తనను అనుసరించిన నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేశారు. చాలా చోట్ల ఆయన తన అభ్యర్థులను బరిలోకి దించారు. దీంతో ఆదినారాయణరెడ్డి వర్గం పూర్తి స్థాయి సంతృప్తిలో ఉంది.
మరోవైపు రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడంతో ఇక అక్కడ వైసీపీకి అంతా తిరుగులేదనుకున్నారు. కానీ రామసుబ్బారెడ్డికి ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మధ్య పొసగడం లేదు. అయినా సర్దుకుపోవాల్సిన పరిస్థితి రామసుబ్బారెడ్డిది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎక్కువగా సుధీర్ రెడ్డి తన వర్గం వారికే టిక్కెట్లు ఇప్పించుకున్నారు ఈ నేపథ్యంలో రామసుబ్బారెడ్డి వర్గంలో అసంతృప్తి తలెత్తిందంటున్నారు. ఎలా చూసినా ఈ సమకాలికులలో ఆదినారాయణ రెడ్డి ముందంజలో ఉండగా రామసుబ్బారెడ్డి మైనస్లో పడిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.