YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే వాటన్నింటినీ మించేలా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వ్యవస్థ పై ఆయన తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే…. తాజాగా సీఎం జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మనబడి, ‘నాడు-నేడు’ పనులు పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2021-22 విద్యా సంవత్సరం నుండి ఏపీ లోని ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలో పాఠశాల విద్యలో కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో 1 నుండి 7వ తరగతి వరకు సీబీఎస్ఈ విధానం అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే ఏడాదికి ఒకసారి చొప్పున 2024 నాటికి రాష్ట్రంలో పదవతరగతి వరకూ సిబిఎస్ఈ విధానం అమలు లోకి రావాలని జగన్ ఆదేశించారు. అలాగే పిల్లలకు ఇచ్చే పాఠ్య పుస్తకాలు కూడా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉండాలని అధికారులను ఆయన సూచించారు.
దీంతోపాటు అమ్మఒడి విద్యార్థులకు లాప్టాప్ అందజేయవలసిందిగా వాటి నాణ్యత సర్వీసు కూడా బాగుండాలని ఆయన ఆదేశించారు. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల దోపిడీని అరికడుతూ సీఎం జగన్ ‘నాడు-నేడు’, అమ్మఒడి విద్యా కానుక అంటూ అనేక పథకాలను పేద విద్యార్థుల కోసం ప్రవేశపెట్టారు .ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా జగన్ వేసిన అడుగు విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటోంది.
విద్యార్థులకు ఓటు హక్కు లేకపోయినా… భావి భారతానికి వారే ఆయువుపట్టు కావడంతో వారి సంక్షేమానికి జగన్ పెద్దపీట వేస్తున్నారు అంటూ మేధావులు విద్యావేత్తలు అయనను తెగ పొగిడేస్తున్నారు.