YSRCP: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఏపీలో ప్రధాన రాజకీయ పక్షాలు అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు పూర్తి చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ – జనసేన 99 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేసింది. రేపు మరో 30 మంది అభ్యర్ధులను ప్రకటించేందుకు టీడీపీ సిద్దమవుతోంది.
తాజాగా వైసీపీ తమ అభ్యర్ధుల జాబితాను వెల్లడించేందుకు సిద్దమవుతోంది. ఈ నెల 16వ తేదీన ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్ధుల తుది జాబితాను వెల్లడించనున్నట్లు వైసీపీ తెలిపింది. విడతల వారీగా కాకుండా ఒకే సారి మొత్తం సీట్లను వైసీపీ ప్రకటించనుంది. గెలుపు గుర్రాలే లక్ష్యంలో ఇప్పటికే కసరత్తు చేసిన వైసీపీ..దాదాపు 70కి పైగా నియోజకవర్గాల్లో ఇన్ చార్జిల మార్పులు చేర్పులు చేసింది. తాజాగా నియమింపబడిన ఇన్ చార్జిలనే అభ్యర్ధులుగా ప్రకటించనుంది.
ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద అభ్యర్ధుల జాబితాను సీఎం వైఎస్ జగన్ స్వయంగా ప్రకటిస్తారని వైసీపీ పేర్కొంది. గత ఎన్నికలకు ముందు కూడా ఇడుపులపాయ నుండే సీఎం జగన్ అభ్యర్ధుల ప్రకటన చేశారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ తో ఇడుపులపాయ లో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన తర్వాత అభ్యర్ధుల ప్రకటన చేయనున్నారు.
ఇక అభ్యర్ధుల ప్రకటన తర్వాత ఉత్తరాంధ్ర నుండి వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. మార్చి 18న ఇచ్చాపురం నుండి వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రోజుకు రెండు లేదా మూడు బహిరంగ సభలు, రోడ్ షోలలో సీఎం జగన్ పాల్గొనేలా వైసీపీ షెడ్యుల్ రూపకల్పన చేస్తొంది.
తొలి రోజు ఇచ్చాపురం, విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో జగన్ ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించనున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలను కవర్ చేసేలా ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలు రూప్ మ్యాప్ పైన చర్చించినట్లు తెలుస్తొంది.
BJP: 72 మందితో బీజేపీ రెండో జాబితా విడుదల .. తెలంగాణ నుండి ఈ ఆరుగురికి చోటు