గత కొద్దికాలంగా సంచలన కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు మొదట్లో సీరియస్గానే పట్టించుకున్నారు. అయితే తర్వాతే లైట్ తీసుకున్నారు.
కానీ మళ్లీ ఆయనపై ఎదురుదాడి మొదలు పెట్టినట్లున్నారు. తొట్లకొండ వంటి చారిత్రక ప్రదేశాల్లో గెస్ట్ హౌస్ నిర్మించాలంటూ నరసాపురం ఎంపీ కేంద్రానికి లేఖ రాశారు. దీంతో రఘురామ కృష్ణంరాజుపై తాజాగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు.
పులి వేషం… నక్క అంటూ ఓ రేంజ్ లో
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాసిన స్క్రిప్ట్ ను చదువుతున్నారని ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. రఘురామకృష్ణరాజు పులివేషంలో ఉన్న ఓ నక్క అని కామెంట్ చేశారు. విశాఖపట్నంతో సంబంధం లేని ఆయన కేంద్రానికి ఎలా లేఖ రాస్తారని అన్నారు. అసలు తొట్లకొండ ఎక్కడుందో రఘురామ కృష్ణంరాజు కు తెలుసా.?అని మంత్రి అవంతి ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని అవంతి హితవు పలికారు.
పచ్చ మీడియా ప్రచారమట
విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న స్టేట్ గెస్ట్ హౌస్కు, తొట్లకొండకు ఎటువంటి సంబంధం లేదని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ నిర్మాణం వల్ల తొట్లకొండకి ఎటువంటి ముప్పు లేదని తేల్చి చెప్పారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు కొన్ని పచ్చమీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలని ఖండిస్తున్నామన్నారు. చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు.
రఘురామ కృష్ణంరాజుకు అంత దమ్ముంటే…
రఘురామ కృష్ణంరాజుకు పలుకుబడి ఉంటే నరసాపురం-కోటిపల్లి రైల్వేలైన్ కోసం ప్రయత్నించాలని ఏపీ మంత్రి అవంతి సూచించారు. అనవసర విషయాలలో జోక్యం చేసుకోవద్దని రఘురామ కృష్ణంరాజుకు అవంతి హితవు పలికారు. జగన్ భిక్షతో గెలిచిన రఘురామకృష్ణరాజు దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని అన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఎంపీల జాబితాలో నుంచి రఘురామ కృష్ణంరాజును పక్కన పెట్టేశామని అవంతి ప్రకటించారు. కాగా, ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు లోక్సభ స్పీకర్కు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై వేటు వేయాలంటూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.