YSRCP: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టో లపైనే ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఆయా రాజకీయ పార్టీలు ప్రకటించే హామీల పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతుంటారు. కర్ణాటక అసెంబ్లీ సమయంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, తక్కువ ధరకు వంట గ్యాస్ సిలెండర్ వంటి హామీలకు ప్రజలు ఆకర్షితులు అయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం గట్టారు. దీంతో అటువంటి హామీలనే తెలంగాణ కాంగ్రెస్ కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించింది. తెలంగాణలో ప్రజలు ఆ హామీలను నమ్మారు. కాంగ్రెస్ ను గెలిపించారు.
కర్ణాటక ఎన్నికల తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీ అక్కడి కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో కొన్నింటిని కాపీ కొట్టడంతో పాటు ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలకు పేరు మార్పు చేసి ఎక్కువగా లబ్ది చేకూర్చే విధంగా మినీ మేనిఫెస్టోను విడుదల చేసింది. సూపర్ సిక్స్ పేరుతో వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళుతున్నారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి తెలంగాణలో మంచి స్పందన లభిస్తొంది. లక్షలాది మంది మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. టీడీపీ ఇంత వరకూ పూర్తి స్థాయి మేనిఫెస్టోను ఇంకా విడుదల చేయలేదు.
టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టోను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మరో పక్క బీజేపీతో దోస్తీకి ప్రయత్నిస్తున్నందున ఆ అంశం ఫైనల్ అయ్యే వరకూ ఆగాలని ఆలోచన చేస్తుంది. అధికార వైసీపీ మేనిఫెస్టో ప్రకటనకు మూహూర్తం ఖరారు చేసింది. గత ఎన్నికల సమయంలోనే జగన్ ..మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ అంత పవిత్రంగా చూస్తామని చెప్పడంతో పాటు మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్న పథకాలకు అమలు చేసి చూపించారు. మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో 99శాతం అమలు చేసినట్లుగా వైసీపీ ఘంటాపథంగా చెబుతోంది.
దీంతో ప్రజలను మరింతగా ఆకర్షించేందుకు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎటువంటి హామీలతో మేనిఫెస్టో ప్రకటిస్తారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోకు చట్టబద్దత లేకపోవడంతో ఇచ్చిన హామీల్లో కొన్నింటిని తుంగలో తొక్కినా చేసేది ఏమీ లేదు. అందుకే ఆచరణ సాధ్యం కాని హామీలను ఇస్తుంటారు. ఆ తర్వాత దానిపై ఏదో కవర్ చేసుకుంటారు. వివిధ వర్గాలను ఆకట్టుకునేలా హామీలను ఇస్తుంటాయి రాజకీయ పార్టీలు.
గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించిన అనేక అంశాలను గాలికి వదిలివేశారు. అలానే ఉద్యోగ వర్గాలను ఆకట్టుకునేందుకు గత ఎన్నికలకు ముందు జగన్మోహనరెడ్డి ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీని నెరవేర్చడం సాధ్యం కాదని చేతులు ఎత్తేశారు. ఇలాంటివి రెండు మూడు మినహా దాదాపు మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలను జగన్మోహనరెడ్డి సర్కార్ నెరవేర్చడంతో ఈ సారి ఎటువంటి హామీలను మేనిఫెస్టోలు ప్రకటిస్తారు అనే దానిపై ప్రజలతో పాటు రాజకీయ పక్షాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇంతకూ వైసీపీ మేనిఫెస్టో ప్రకటన ఎప్పుడు.. ఎక్కడ అనే విషయానికి వస్తే..
బాపట్ల జిల్లా మేదరమిట్ల వద్ద ఈ నెల పదో తేదీన సిద్దం సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు సంబంధించిన వాల్ పోస్టర్ లను శనివారం వైసీపీ నేతలు విడుదల చేశారు. ఈ సభలో నాలుగు సంవత్సరాల పది నెలల్లో వైసీపీ సర్కార్ చేసిన అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన విషయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరిస్తారు. ఈ సభలోనే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తారు. ఈ విషయాన్ని పార్టీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. గతంలో ఏమి చేశాం.. రాబోయే కాలంలో ఏమి చేస్తామో సీఎం జగన్ వివరిస్తారని ఆయన తెలిపారు.
BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ