అమరావతి, జనవరి 29: రాష్ట్ర ప్రయోజనాల కోసం వైరుధ్యాలను పక్కన పెట్టి పని చేసేందుకు అన్ని పార్టీల నేతల సంసిద్దత వ్యక్తం చేశాయని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్కుమార్ చెప్పారు. విభజన హామీలు, కేంద్రం నుండి రావాల్సిన నిధుల అంశంపై విజయవాడలో ఉండవల్లి అధ్యక్షతన మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, తెలుగుదేశంపార్టీ, జనసేన, కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ, సిపిఐ, ఆమ్ఆద్మీపార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్లో విభజన రాజ్యాంగ బద్ధంగా జరగలేదన్న అంశంపై చర్చ జరగాలని నేతలను కోరినట్లు తెలిపారు. అందుకు అన్ని పార్టీలు అంగీకరించాయని ఆయన చెప్పారు. మనకు దెబ్బతగిలినప్పుడు ప్రతిస్పందించాలనీ, అలా చేయకపోతే సమస్యలు పరిష్కరం కావనీ ఆయన అన్నారు. అందరూ కలవాలన్నదే మా ఆశ,ఆకాంక్షగా ఆయన పేర్కొన్నారు. విభజన రాజ్యాంగ బద్ధంగా జరగలేదన్న అంశంపై చర్చ జరగాలని ఆయన పార్టీల నేతలను కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావడంతో మీటింగ్ ఇమేజ్ను మరింత పెరిగిందని ఆయన అన్నారు. సమావేశానికి రాని పార్టీలు కూడా తనతో ఏకీభవిస్తాయని ఆయన చెప్పారు.
రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి అన్ని పార్టీలు మాట్లాడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కలసి రావాలని ఆయన కోరారు. రాజ్యాంగ స్పూర్తికి విరుధ్దంగా రాష్ట్రానికి చాల ద్రోహం జరిగిందని ఆయన చెప్పారు. అందరూ ఏకతాటిపై రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన కోరారు.రాష్ట్రానికి ఎంత మేర నిధులు రావాలి అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఇటువంటి తరుణంలో కూడా మనం కలసి పోరాడకపోతే ఇక ఎప్పటికీ న్యాయం జరగదని ఆయన అన్నారు.
రాష్ర్టానికి ఒక లక్షా16వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాల్సి ఉందనీ, ఆ అనిధులను ఇవ్వాలనీ తము కోరుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యహరిస్తోందని ఆయన ఆరోపించారు.
కేంద్రం వివరణ తీసుకోకుండా ఎంత మేర నిధులు ఇవ్వాలన్నది తేల్చి చేప్పలేమని భారతీయ జనతా పార్టీ నేత, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. నిధుల మంజూరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరిష్కరించుకోవాల్సిన అంశమని ఆయన చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి సహకరించండం లేదన్న రాజకీయపార్టీల వాదనను ఆయన త్రోసిపుచ్చారు.
కేంద్ర ప్రభుత్వ సాయంపై అఖిలపక్షంలో రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం ఆఖిలపక్షానికి హాజరుకాలేదు.
ఆంధ్రులను మోసం చేసిన టిడిపి,జనసేన నేతల మధ్యన కూర్చోవడం ఇష్టంలేకనే అఖిలపక్ష సమావేశానికి హాజరుకాలేదని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. ఉండవల్లికి తాము వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే అఖిలపక్ష సమావేశానికి కూడా రావడంలేదని ఆయన తెలిపారు.