ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం శాసనసభలో విజన్ 2029 పత్రాన్ని విడుదల చేశారు. ప్రతిపక్షం లేని శాసనసభలో సమావేశాల చివరి రోజున, ఆయన రానున్న పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ను ఆయా రంగాలలో ఎలా ముందుకు తీసుకువెళ్లేదీ, ఎంత ముందుకు తీసుకువెళ్లేదీ ఆ పత్రంలో వివరించారు.
చంద్రబాబు దార్శనికత ఉన్న నాయకుడు అనడంలో సందేహం లేదు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు విజన్ 2020 పేరుతో ఒక పత్రం విడుదల చేశారు. నిన్న సభలో ఆయనే చెప్పుకున్నట్లు అప్పుడు ప్రతిపక్షాలు ఆయనను ఎగతాళి చేశాయి. పత్రికలలో కూడా దానిపై చర్చ జరిగింది. అప్పటివరకూ తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చంద్రబాబు అనుకుంటున్నారా అన్నది ఆనాడు వినబడిన ప్రధానమైన వ్యాఖ్య.
ఈ మధ్యలో చంద్రబాబు పదేళ్ల పాటు అధికారానికి దూరమయ్యారు. 2014లో మళ్లీ అధికారం చేపట్టగలిగారు. పదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి కుర్చీ మళ్లీ దక్కేసరికి రాష్ట్రం సగమయిపోయింది. ఆయన కష్టపడి అభివృద్ధి చేసిన హైదరాబాద్ నగరం ఆంధ్రప్రదేశ్కు కాకుండా పోయింది. తెలంగాణా రాజధానిగా మిగిలింది.
అవశేష ఆంధ్రప్రదేశ్ను అయిదేళ్లు పాలించిన చంద్రబాబు మూడు నెలల్లో మళ్లీ ప్రజల తీర్పుకు వెళ్లనున్నారు. ఈ సమయంలో ఆయన రాష్ట్ర శాసనసభలో విజన్ 2029 ప్రకటించడానికి ఏమాత్రం జంకలేదు. పైగా విజన్ 2020 ప్రకటించినపుడు తనకు ఎదురయిన అవహేళనల గురించి కూడా మాట్లాడారు. ముఖ్యమంత్రి చేసినదాంట్లో టెక్నికల్గా తప్పేమీ లేదు. ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి తన విజన్ ఏమిటో ప్రకటించేందుకు ఆయనకు హక్కుంది. అయితే కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, అది పార్టీ వేదికపై అయితే ఇంకా ఉచితంగా ఉండేది. అలా కాకుండా ఆయన అసెంబ్లీ వేదికగా విజన్ ప్రకటించి అందులోని లక్ష్యాలను తన పార్టీ ప్రణాళికలో చేరుస్తానని చెప్పారు.
చంద్రబాబు ఆ విజన్ 2029ని స్పీకర్ కోడెల శివప్రసాద రావుతో ఆవిష్కరింపజేయడం విశేషం. స్పీకర్ కూడా ఏమాత్రం సందేహించకుండా విజన్ పత్రాన్ని ఆవిష్కరించారు. అంతటితో ఆగలేదు మళ్లీ సభానాయకుడిగా చంద్రబాబే రావాలను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. సభలో ఉన్న సభ్యులందరూ మళ్లీ గెలిచి రావాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రతిపక్షం లేని సభ ఎలా జరుగుతుందో చూపించారు.
ఈ మాటలకు అర్ధం తెలియని వారు ఎవరన్నా ఉంటే, మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని స్పీకర్ కుర్చీ నుంచి కోడెల ప్రకటించారు. తాను ఆకుర్చీలో ఉన్నంత కాలం తాను తటస్థుడననీ, తనకు పార్టీ ఉండదన్న విషయం ఆయన యధావిధిగా మరచిపోయారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా సభ సమావేశాల చివరి రోజున, బాబూ మళ్లీ మీరే రావాలి అని నినదించారు. అసెంబ్లీలో ఈ తతంగం అంతా జరుగుతుంటే, మొత్తం మీరే దున్నుకోండి అంటూ ఫీల్డ్ మొత్తం టిడిపికి వదిలేసిన వైఎస్ఆర్సిపి నేత జగన్మోహన రెడ్డి సమర శంఖారావం, అన్న పిలుపు పేరుతో కడప జిల్లాలో తిరుగుతున్నారు.