టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాణిక్య రాజకీయాన్ని వైకాపా అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవపోసన పట్టినట్లున్నారు. 2014 ఎన్నికల తరువాత చంద్రబాబు అధికారంలోకి రాగానే వైకాపాను బలహీన పర్చేందుకు ఆ పార్టీ నుండి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలను టీడీపీలో చేర్చుకొని పార్టీ కండువాలు కప్పారు. వైకాపా నుండి గెలుపొందిన 23మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. అయితే ఇప్పుడు సిన్ రివర్స్ అయ్యింది. టీడీపీ నుండి వైకాపాకు వలసల పర్వం కొనసాగుతోంది. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్టు టీడీపీ నుండి వచ్చే వారికి జగన్ పార్టీ కండువాలు కప్పేస్తున్నారు.
అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సమయంలో పార్టీలో చేర్పులపై ఒక మాట చెప్పారు. చంద్రబాబు మాదిరిగా సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యే లను చేర్చుకొనని చెప్పారు. వైకాపా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకు మెచ్చి ఎవరైనా పార్టీలో చేరవచ్చని కానీ పదవులకు రాజీనామా చేసిన వారినే చేర్చుకుంటామని తెలిపారు.
రోజులు మారుతున్న నేపథ్యంలో టీడీపీ ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలన్న తలంపుతో ఆ కండిషన్ ను పక్కకు పెట్టారు. దీనితో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యే లు వైకాపా పంచన చేరారు. అయితే వీరు వైసీపీ కండువాలు కప్పుకోలేదనే కానీ అసోసియేట్ లుగా ఉంటున్నారు. టీడీపీ నేతలను చేర్చుకోవడం వల్ల సొంత పార్టీ వైకాపాలో అలజడి రేకెత్తుతోంది. నియోజకవర్గాలలో రెండు గ్రూపులు ఏర్పడతాయని, రెండు వర్గాలు కలసి పని చేయడం కష్టమని భావిస్తున్నారు. అయితే పార్టీలో చేరే వారికి జగన్ ఎటువంటి హామీలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. హామీల కోసం ప్రయత్నించే వారితో ‘పార్టీ కోసం పని చేయండి అన్నా.. తర్వాత చూద్దాం’ అని సున్నితంగా తప్పించుకుంటున్నారని అంటున్నారు.
చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు తదితర నేతలు చేరిన సమయంలోనూ వారికీ ఎటువంటి హామీలు ఇవ్వలేదని సమాచారం. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తన కుమారుడికి అద్దంకి నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ గా నియమించాలని కోరుతున్నా..అది దక్కలేదు. మరో పక్క చీరాల నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ గా మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ కొనసాగుతారని స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీలో చేరే వారికి జగన్ ఎటువంటి హామీలు ఇవ్వకపోవడంతో సొంత పార్టీ వైకాపా నేతలు ఊరట చెందుతున్నారు.