వైకాపా అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న ఆశయంతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శప్రాయంగా నిర్వహిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. అదే మాదిరిగా రాజకీయంగా సుదీర్ఘ కాలం అధికారాన్ని హస్తగతంలోనే ఉంచుకునేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారని అందులో భాగంగానే ఉత్తరాంధ్రలో పూర్తి స్థాయిలో పాగాకు పావులు కదుపుతున్నారుట. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో శాశ్వతంగా పాగా వేస్తే వైకాపా మూడు దశాబ్దాల రాజకీయానికి బాటలు వేసుకోవచ్చని జగన్ ఆలోచనగా చెబుతున్నారు. అందుకే విశాఖకు పరిపాలన రాజధాని తరలింపుపై పట్టుదలగా ఉన్నారు. ఇదే క్రమంలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో టీడీపీ పెద్ద తలకాయలకు గట్టి షాక్ లు ఇవ్వాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. ఈ మూడు జిల్లాలలో ప్రత్యర్థి పార్టీలోని పెద్ద తలకాయలకు గట్టి ఝలక్ ఇస్తున్నారు. వారు వైకాపా వైపు వస్తే సరే సరి, లేకుంటే వారికి సినిమా చూపించాల్సిందే అన్నట్లుగా ఉంది జగన్ తీరు. ఈ క్రమంలో భాగంగానే శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలుగా అతి పెద్ద బీసీ కుటుంబంగా ఉన్న కింజరాపు ఫ్యామిలీ నుంచి ఒకరికి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించడం. ఈ చర్యలు ఆ జిల్లాలో టీడీపీని నైరాశ్యంలోకి నెత్తినట్లు అయిందంటున్నారు. రానున్న రోజుల్లో టీడీపీకి ఇక్కడ పెద్ద గొంతు, అండ ఉండకూడదు అన్న లక్ష్యం. దీని పర్యవసానం తో మిగిలిన చోటా మోటా నాయకులు సైతం దారిలోకి వచ్చే పరిస్థితి.
మరో పక్క విజయనగరం జిల్లాలో దశాబ్దాల కాలంగా టీడీపీ రాజకీయాలకు చక్రం తిప్పిన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజుకు ఆయన అన్న కూతురు సంచయిత గజపతిరాజు నుండే తలనొప్పులు ప్రారంభం అయ్యాయి. మాన్సాస్ ట్రస్ట్ గొడవలు, ఆస్తి వివాదాలు, వారసత్వపు తగవులు..ఇలా ఆమెతో పోరుతోనే ఆయన జీవితం సరిపోయేలా పథకం రచించారు. ఇప్పటికే ఆయన రెండు సార్లు పరాజయం పాలై రాజకీయంగా బాగా తగ్గిపోయారు. ఈ జిల్లాను పూర్తి స్థాయిలో హస్తగతం చేసుకుని పదే పదే గెలిచేందుకు సీఎం జగన్ గట్టి కార్యాచరణను సిధ్ధం చేశారు.
ఇక విశాఖ జిల్లా రాజకీయం చూసుకుంటే టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చుట్టూ ఉన్న వారందరినీ తెలివిగా వైసీపీ తనవైపునకు లాగేసుకుంది. దాంతో ఆయనది పూర్తిగా ఒంటరి పోరాటం అయింది. అయ్యన్న నోటి దురుసును ఆసరాగా చేసుకుని ఆయనపై పోలీసులు వరసగా కేసులు నమోదు చేస్తున్నారు. ఆయన మరీ రెచ్చిపోతే జైలు ఊచలు లెక్కపెట్టించడం పెద్ద కష్టం కాదు. ఇక విశాఖ అర్బన్ లో పెద్ద లీడర్ గా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. అయన వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుండి నోరు విప్పితే ఏమవుతుందో అన్న భయంతో అసెంబ్లీలోను, బయట కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమి మాట్లాడటం లేదు. మిగిలిన వారంతా చోటా మోటా నాయకులు. ఈ పరిస్థితులు చూస్తుంటే ఉత్తరాంధ్రాలో తిరుగు లేని ఆధిపత్యం జగన్ సొంతం అవుతుంది అంటున్నారు.