AP Politics : ఏపీ రాజకీయాలు AP Politics రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు తప్పవు. కానీ.. ఈమధ్య వ్యక్తిగత విమర్శల స్థాయి నుంచి ఉన్నత పదవుల్లో ఉన్నవారిని సైతం ఏకవచనంతో తిట్టే పరిస్థితులు వచ్చేశాయి. లోకేశ్ టీడీపీ యువ నాయకుడు. గత ఐదేళ్లలో ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మాటల్లో వాడి వేడి పెరిగింది. సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నారు. ఈక్రమంలో తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలోనూ ఇది కనిపిస్తోంది. జగన్ ఏం పీకాడు.. ఎంత దొబ్బాడు.. వంటి డైలాగ్స్ వేశారు. రీసెంట్ టైమ్స్ లో.. ‘అమ్మా మొగుడి సొమ్మా’ వంటి డైలాగ్స్ కూడా వేశారు.
చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయన ఈమధ్య మాట్లాడిన తరహాలో గతంలో ఎప్పుడూ మాట్లాడిన దాఖలాలు లేవు. రాజధాని ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ.. ‘ఏం పీకాడు..’ అన్నారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూడా.. గుంటూరు ప్రజలకు సిగ్గుందా? హైదరాబాద్ వెళ్లి పాచి పనులు చేస్తారా? మీకు సిగ్గు లేదు? వంటి డైలాగులు వేశారు. సీఎం జగన్ ను వాడు.. వీడు అనే పదాలు.. ఫేక్ సీఎం అని కూడా అన్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ కూడా ఇదే తరహాలో మాట్లాడారు. చంద్రబాబును నడిరోడ్డుపై ఉరి తీయాలి. కాల్చి పారేయ్యాలి.. అని వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ రాజకీయాల్లో హుందాతనానికి నిదర్శనం కాదు.
కొడాలి నాని తీవ్రమైన పదజాలంతో చంద్రబాబు, లోకేశ్ పై విరుచుకుపడుతూ ఉంటారు. ఇవి ప్రెస్ మీట్లోనో, విలేకరులతో మాట్లాడుతూనో చేస్తారు. కానీ.. ప్రజల మధ్యలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు ఇబ్బందికరమే. రాజకీయ విమర్శలు సహజమే అయినా.. వ్యక్తిగతంగా వెళ్లడం తగనిదే. నాడు జగన్ ఉపయోగించిన పదజాలంపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. నేడు చంద్రబాబు, లోకేశ్ కూడా ప్రజల్లోకి అలాంటి పదాలతోనే వెళ్తున్నారు. అలవాటు లేని మాటలతో ప్రజల్లో చులకన అయ్యేకంటే.. హుందాగా మాట్లాడితేనే ప్రజల్లో విశ్వాసం పెంచుకోగలరు. వాళ్లు తిట్టారు కాబట్టి.. మేమూ తిడతామంటే ఇద్దరూ ఒకటే.. అని ఒకరిని ఆప్షన్ గా తీసుకుంటారు.