రాజధాని అంశంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. రాజధాని పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశం. అని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు హైకోర్టులో ఒక కౌంటర్ దాఖలు చేసింది. సాయంత్రం నుంచి ఇదే చర్చనీయాంశంగా మారింది. అంటే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి, కేంద్రం పూర్తి స్థాయిగా జై కొట్టిందని రాజధాని వికేంద్రీకరణతో ఏమాత్రం సంబంధం లేకుండా కేంద్రం ఈ కౌంటర్ దాఖలు చేసిందని జగన్ అనుకూల వర్గాలు సంబరపడుతున్నాయి. కానీ ఈ కౌంటర్ లో కొన్ని ట్విస్టులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. అసలు కేంద్రం వేసిన పిటిషన్ లో ఏముంది, ఏమీ లేదు అనేది పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు బయట పడుతున్నాయి.
పిటిషన్ లో లొసుగులు
కేంద్ర ప్రభుత్వం హైకోర్టు కు సమర్పించిన అఫిడవిట్ మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన వ్యాజ్యానికి సంబందించినది కాదు. గత ప్రభుత్వ హయంలో అంటే 2018 లో ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాసరావు అనే రైతు తరపున పీవీ కృష్ణయ్య అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. కేంద్రానికి నోటిస్ జారీ చేయగా కేంద్ర హోమ్ శాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ లోని అంశాలు ఏమి టంటే..ప్రత్యేక హోదా, రాజధానికి నిధులు, కేంద్ర ప్రభుత్వ ఇన్సిస్టిట్యూట్ లకు సంభందించిన అంశాలు. అయితే ప్రస్తుతం మూడు రాజధానుల అంశంపైన వ్యతిరేకిస్తూ దాఖలు అయిన పిటిషన్ ల పైనా హైకోర్టులో విచారణలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ విధంగా అఫిడవిట్ దాఖలు చేయడం రాజధాని రైతుల్లో ఆందోళన, టీడీపీ సహా ఇతర పక్షాల్లో అలజడి, వైసీపీ శ్రేణుల్లో ఆనందం నెలకొన్నాయి. పిటిషన్ లోని అసలు అంశాలపై వివరణలు పక్కన పెట్టి రాజధాని అంశంతో కేంద్రానికి సంభందం లేదు అన్న విషయాన్ని హైలైట్ చేస్తూ అఫిడవిట్ దాఖలు చేయడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
రాజధానికి సంబంధించి 32పిటిషన్ లు
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టుదలగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు, రైతు పరిరక్షణ సమితి, వివిధ ప్రజా సంఘాలు ఉన్నత న్యాయస్థానంలో వేరు వేరుగా పిటిషన్ లు దాఖలు చేశాయి. రాజధానికి సంబందించి మొత్తం 32 పిటిషన్ లపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ జరుపుతున్నది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ లో రాష్ట్ర రాజధానికి 2500 కోట్లు కేటాయించిన విషయాన్ని పేర్కొనలేదు.