అనంతపురం జిల్లా తాడిపత్రి లో జరిగిన ఘర్షణ గురించి టిడిపి అధినేత చంద్రబాబు అతని కుమారుడు లోకేష్ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వారిద్దరూ సీఎం జగన్ కు వైసీపీ సర్కార్ కు వార్నింగ్ ఇవ్వడం జరిగింది…
కుల ప్రస్తావన అవసరమా బాబు…?
తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి టిడిపి నేత మాజీ మంత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి చేయడాన్ని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఏపీలో టీడీపీ నేతలు దళితులు, బీసీలను లక్ష్యంగా చేసుకుని దాడులు హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు మండిపడ్డాడు. అంతేకాకుండా దళిత యువతి స్నేహలత హత్యకు మాజీ ఎమ్మెల్యే జేసీ ఇంటిపై జరిగిన దాడికి లింకు ఉందని బాబు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
లింక్ కనిపెట్టేందుకు సీబీఐ కావాలా…?
ఎంతో విచిత్రంగా స్నేహలత హత్యకు జెసి ఇంటిపై దాడికి చంద్రబాబు లింకు పెట్టడం రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. స్నేహలత హత్య కేసు నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు జెసి ఇంటిపై దాడికి దిగారని చంద్రబాబు ఆరోపించారు. కేవలం రెండు ఘటనలు అనంతపురం జిల్లాలో సంభవించాయి అన్న ఒక్క కారణంతో చంద్రబాబు ఇలా మాట్లాడటం చూసి అందరూ విస్తుపోతున్నారు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి సిబిఐ దర్యాప్తు కూడా ఈ విషయంపై చేయించాలని బాబు డిమాండ్ చేశారు.
దేనినైనా రాజకీయం చేయాల్సిందే…
ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఇష్టం వచ్చిన ఆరోపణలు చేయడానికి బాబు ముందు ఉంటాడు అని తెలిసిందే. దళిత యువతి స్నేహలత హత్య అని చెప్పడంతో పాటుగా ఈ రెండు ఘటనల్లో బీసీలను చేర్చి వైసీపీకి వ్యతిరేకంగా చంద్రబాబు రాజకీయ లబ్ధిని పొందడం చూసి వైసీపీ నేతలకు ఏమి మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఒక దురదృష్టవశాత్తు జరిగిన ఘోరాన్ని, ఇద్దరు రాజకీయ ప్రత్యర్థుల మధ్య సంభవించిన హింసాత్మక గొడవ కి లింక్ పెట్టడం చంద్రబాబుకే చెల్లింది అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే క్రమంలో జెసి ఇంటిపై దాడి చేస్తే చంద్రబాబు తలకి దెబ్బ తగిలినట్టుంది సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.