Tdp: టీడీపీ Tdp ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది. ఇందుకు కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. గెలుపోటములు సహజమే అయినా.. టీడీపీ స్వయంకృతాపరాధం.. మీడియా అతి ప్రచారం.. ఎన్నికల ముందు నాటి పరిస్థితులు, టీడీపీ నాయకుల్లో లోపించి ఆత్మస్థైర్యం, అంతర్గత కుమ్ములాటలు, నాయకత్వ లేమి, యువత పాత్ర లేకపోవడం, మంత్రులుగా పనిచేసిన చాలామంది నాయకులు పార్టీకి అండగా లేకపోవడం, ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రజలను బెదిరించినట్టు మాట్లాడటం, సీఎం జగన్ ను ఫేక్ సీఎం అనడం, లోకేశ్ ప్రచారంలో ఆకట్టుకోలేకపోవడం, బాలకృష్ణ పార్టీ కార్యకర్తలపైనే దాడి చేయడం.. ఇవన్నీ పార్టీ చేసుకున్న స్వయంకృతాపరాధాలే అని చెప్పాలి.
ఇవే కాకుండా టీడీపీపై మొదటి నుంచీ కొన్ని మీడియా సంస్థలు అతి ప్రచారం కూడా వారి కొంప ముంచాయి. కొన్ని పత్రికలు మరీ అతిగా రాసే వార్తలు, మీడియా డిబేట్లు, పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు కూడా కారణమయ్యాయి. వీటికి తోడు పంచాయతీ ఎన్నికల సమయంలో ఎస్ఈసీ – ప్రభుత్వం మధ్య జరిగిన ఎపిసోడ్ కూడా సీఎం జగన్ కే కలిసొచ్చింది. ఎన్నికలు జరిపే విషయంలో ఎస్ఈసీకి అనుకూల తీర్పులే వచ్చినా.. ఇవన్నీ ప్రజల్లో సీఎం జగన్ పై సానుభూతి పెరిగేలా చేశాయి. ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ కావాలనే ఇలా చేయిస్తోందన్న అధికార పార్టీ నాయకుల మాటలే ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. దీంతో వైసీపీకి ఎదురేలేకుండా పోతే.. టీడీపీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన ఓటమి స్థాయిలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వచ్చింది.
విజయవాడ టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నట్టుగా.. టీడీపీలో దశాబ్దాలుగా కుర్చీని అంటిపెట్టుకున్న నాయకులే ఎక్కువయ్యారు. పార్టీలో యువతకు ప్రధాన్యం లేకపోవడం.. తనకు నమ్మకంగా ఉన్నవారినే చంద్రబాబు చేరదీయడం, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేకపోవడం ఆ పార్టీలోని బలహీనతలని చెప్పొచ్చు. టీడీపీ ఏర్పాటయ్యాక ఎన్టీఆర్ వెంట నడిచిన వారంతా యువకులే. ఇప్పుడూ చంద్రబాబు ఆలోచించాల్సిన విషయాల్లో ఇది ప్రముఖమైంది. యువతకు పార్టీలో పెద్ద పీట వేస్తామని 2014 ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ చెప్పారు.. అధికారంలోకి వచ్చాక మరిచారు. ఇప్పుడూ అదే మాట చెప్తున్నారు. కానీ.. ఈసారైనా జరుగుతుందో లేదో చూడాలి..!