2019లో ఏపీలో ఏప్రిల్ 11న అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. మే23న ఫలితాలు వచ్చాయి. ఈ మధ్యలో విజయవాడలో టీడీపీ నేత బుద్దా వెంకన్న అదే పనిగా ప్రెస్ మీట్లు పెడుతూ.. ‘టీడీపీనే గెలుస్తుంది.. రాసి పెట్టుకోండి..’ అంటూ బాలయ్య తరహాలో తొడ కొట్టి మరీ చెప్పారు. కానీ టీడీపీ ఓడిపోయింది. తర్వాత ఇదే విషయమై విలేకరులు బుద్దా వెంకన్నను అడగ్గా.. ‘కార్యకర్తలు డీలా పడకుండా ఉత్సాహపరిచేందుకే’ అలా చేశాను అని చెప్పుకొచ్చారు. ఇదంతా ఎందుకంటే.. టీడీపీ అవే జిమ్మిక్కులు మళ్లీ చేస్తోంది. త్వరలో తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. నోటిఫికేషన్ రాలేదు. కానీ.. మనమే గెలుస్తాం.. వైసీపీని ఎలా ఓడించాలంటే.. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్సుల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు.
జగన్ మార్క్ ప్లాన్..
ప్రతిపక్షంలో ఉన్న టీడీపీనే ఇంత హడావిడి చేస్తే అధికారంలో ఉన్న వైసీపీ మరెంత చేయాలి. కానీ.. పైకి సెలెంట్ గా ఉన్నట్టు అనిపిస్తున్నా సీఎం జగన్ తన ప్లాన్ లో తాను ఉన్నారు. ఇందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటికే పార్టీలోని సీనియర్లను తిరుపతిలో ఇంచార్జిలుగా నియమించారు. అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి కొత్త కావడంతో ఆయన గెలుపు బాధ్యత పార్టీదే. జగన్ అదే చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీని ఈ నెల 25 క్రిస్మస్ పండగ సందర్భంగా తిరుపతి నుంచే ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని కూడా ఆలోచిస్తున్నారు. అది కూడా తిరుపతి నుంచే ప్రారంభించి పార్టీ, నేతలు, కార్యకర్తలు, ప్రజల్లో జోష్ తీసుకురావాలనేది ఆయన ప్లాన్ గా తెలుస్తోంది.
ఆ విషయం చంద్రబాబుకు తెలీదా..
ఎన్నికల సందర్భంగా ప్రత్యేకించి సీఎం జగన్ పర్యటించినట్టు కాకుండా.. పుణ్యక్షేత్రం, పాదయాత్ర ప్రారంభం సెంటిమెంట్.. ఇలాంటి అంశాలను కూడా తీసుకుని ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం, ఎన్నికల ప్రచారం, ఏడాదిన్నర పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడం.. ఇలాంటి ప్లాన్ తో జగన్ అడుగులు వేస్తున్నారనే టాక్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. ఇవన్నీ టీడీపీకి జగన్ మార్క్ షాకులే. అధికారంలో లేని సమయంలో టీడీపీ అక్కడ గెలిస్తే మరో ఎంపీ సీటు గెలవడం తప్ప చేయగలిగేదేమీ లేదు. టీడీపీ కూడా సంస్థాగతంగా బలంగా లేదు. మరి.. టీడీపీ శ్రేణులకే తెలిసిన ఈ నిజాన్ని చంద్రబాబుకు తెలీదా.. లేక మరో బుద్దా వెంకన్న గేమ్ ఆడుతున్నారా.. అనేది వారికే తెలియాలి.