ఆయన 40ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న సీనియర్ నాయకుడు. ప్రతి పల్లెకు తెలిసిన పేరు. ఎన్టీఆర్ కు స్వయానా అల్లుడు. 5సార్లు ఎమ్మెల్యే, 2సార్లు ఎంపీగా పని చేసినా ఆ రాజకీయ దురంధరుడు. ఆయన భార్య రెండుసార్లు ఎంపీగా.. ఓసారి కేంద్రమంత్రిగా పని చేశారు. ఇంత చరిత్ర ఉన్న నాయకుడే దగ్గుబాటి వెంకటేశ్వర రావు. వీరిని ప్రస్తుతం జగన్ పట్టించుకోవట్లేదు. మొన్నటి ఎన్నకల్లో ఓడిపోయిన తర్వాత దగ్గరకు కూడా రానీయలేదు. ఆ సీనియర్ నాయకుడిని జగన్ అవమానిస్తున్నారా. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏంటి.. భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
దగ్గుబాటి ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే..?
దగ్గుబాటి వెంకటేశ్వరరావు 1990 నుంచి 2010 రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. అధికార పార్టీల్లో ఉన్నారు. రాజకీయంగా ఘన చరిత్ర ఉంది. అయినా.. 2019లో వైసీపీ గాలి ఉన్నా పర్చూరు నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. స్వతాహాగా చేసిన తప్పులు, పరిస్థితులు మారడం, నమ్మినవారు పక్కకు వెళ్లిపోవడం ఆయన తొలి ఓటమికి కారణాలయ్యాయి. దీంతో ఆయన జీర్ణించుకోలేక నియోజకవర్గానికి దూరమయ్యారు. రాజకీయంగా కూడా దూరమయ్యారు. అప్పుడప్పుడూ స్వగ్రామం కారంచేడుకు వస్తున్నారు. కుటుంబంతోనే ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. హైదరాబాద్ లోనే వైద్యుడిగా, పుస్తకాలు రాసుకుంటూ, కొంతమంది పెద్దలతో మాట్లాడుతూ రాజకీయ రహిత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ.. ఆయన అడుగులు మాత్రం భవిష్యత్ రాజకీయం వైపే పడుతున్నాయి. కారణం.. కుమారుడికి రాజకీయ మార్గాన్ని ఏర్పరచడమే ఆయన ప్రస్తుత లక్ష్యం.
టార్గెట్ 2024 ఎన్నికలు.. కానీ దారేది?
దగ్గుబాటి దంపతుల రాజకీయ వారసుడిగా వారి తనయుడు దగ్గుబాటి హితేశ్ ఉన్నారు. ప్రస్తుతానికి హితేశ్ వారి వ్యాపారాలు, ఆక్వా పరిశ్రమను చూసుకుంటున్నారు. అయితే.. 2024కి హితేశ్ ను ఎమ్మెల్యేగా చేయాలనేది వీరి లక్ష్యం. నిజానికి.. 2019లోనే ఎన్నికల్లోనే హితేశ్ ను రాజకీయాల్లోకి దింపాలనుకున్నా భారతీయ పౌరసత్వం లేక ఆగిపోయింది. ప్రస్తుతం అన్ని చిక్కులు తొలగిపోయాయి. బీజేపీలో పురంధేశ్వరి కీలకంగా ఉన్నారు. వెంకటేశ్వరరావు తటస్థంగా ఉండిపోయారు. 2024కి హితేశ్ ను ఏదొక పార్టీలో ఎమ్మెల్యేను చేసేందుకు దారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు వైసీపీ, టీడీపీ, బీజేపీల్లో ఏ పార్టీ అనువైనదో అనే ఆలోచనలో ఉన్నారు. సొంతపార్టీ టీడీపీలో చంద్రబాబుతో విబేధాలు.. బీజేపీలో ఓట్లు రావడం కష్టం.. వైసీపీలో వెంకటేశ్వరరావుకు చేదు అనుభవం ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో దగ్గుబాటి వారి వారసుడిని ఏపార్టీలోకి పంపించాలనేది వారికి సవాల్ గా మారింది.