తెలుగుదేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరైంది. ఈఎస్ఐ స్కామ్ లో నిందితునిగా అచ్చెన్నాయుడు అరెస్టైన విషయం విదితమే. అరెస్టయినా అనారోగ్యం కారణంగా మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రిలో అచ్చెన్నాయుడు చికిత్స తీసుకుంటున్నారు.
గతంలో బెయిల్ కోసం అచ్చెన్నాయుడు దరఖాస్తు చేసుకోగా తిరస్కరణకు గురైంది. మరోసారి అచ్చెన్నాయుడు బెయిల్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. రెండు రోజుల క్రితమే వాదనలు విన్న ధర్మాసనం, అచ్చెన్నాయుడుకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్ళొద్దని, సాక్షులను తారుమారు చేయొద్దని, దర్యాప్తు అధికారికి అందుబాటులో ఉండాలని కోర్టు షరతులలో పేర్కొంది. అలాగే రెండు లక్షల పూచికత్తుపై అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు చేసింది.