* భూ బాగోతాలతో జగన్ లక్ష్యానికి దెబ్బ
* ఆవ సహా అనేక ప్రాంతాల్లో ఇదే తంతు
సీఎం జగన్ కి ప్రతిష్టాత్మకమైన ఒక పథకం… ఆ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం కాసులు కురిపించేదిగా మారింది…!
పథకాన్ని అమలు చేసి… పేదలకు మేలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని జగన్ ఉవ్విళ్ళూరుతుంటే.., భూములు కొట్టేసి, కాసులు పోగేసి, కోట్లకు పడగలెత్తాలని నాయకులు ప్రణాళికలు వేశారు…!
చివరికి ఆ నాయకుల లీలలు బయటపడి, కోర్టులకు వెళ్లి, పథకం అమలుకే ఎసరు పెట్టి.., సీఎం జగన్ లక్ష్యానికి దెబ్బ కొట్టేలా మారాయి..!
“రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల కుటుంబాలకు ఇవ్వడానికి 65 వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. అందుకు రూ. 7 వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ ఖర్చులో చాలా చోట్ల వైసీపీ నేతలే కన్ను వేయడం, కన్నం వేయడం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏ మచ్చ లేని జగన్ ప్రభుత్వంపై ఓ అవినీతి మచ్చలా పడింది. దీన్ని ఆరోపణల దశలోనే తుడిచేసి నిరూపించుకోవాల్సిన తరుణం వచ్చేసింది.
అవినీతి ఎలా అంటే…??
ప్రాధమిక దశలో స్థానిక వైసీపీ నాయకులు కొందరు రైతులతో ఒప్పందాలు చేసుకుంటారు. మార్కెట్ రేటు ప్రకారం రైతులకు చెల్లించేసి… ఆ పై దశలో అధిక ధర పెట్టేసి ప్రభుత్వానికి అమ్మేదె ఈ అవినీతి ప్రణాళిక. మార్కెట్ విలువ రూ. 2 లక్షలు ఉంటె రైతులకు అంత మేరకు ఇచ్చేసి, ప్రభుత్వానికి రూ. 20 లక్షలకు అమ్మినా ఎకరంపై రూ. 18 లక్షలు మిగిలినట్టే. ఇది ఒక పధ్ధతి ప్రకారం జరుగుగుతుంది.
* విలువ ఎకరా అయిదు లక్షలు ఉంటే రైతుకు ఎకరాకు అదే ధర ఇచ్చే విధంగా ముందస్తు ఒప్పందాలు జరిగిపోతాయి. ఆ రైతు స్థానిక ఎమ్మార్వోను కలసి ఇళ్ల స్థలాలకు తమ భూములు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని దరఖాస్తు చేసుకుంటాడు. ఇక వెంటనే ఆ అధికారి పరిశీలించి ఆ భూముల వివరాలు జాయింట్ కలెక్టర్, కలెక్టర్ కు పంపిస్తాడు. ఆ వెంటనే వైసీపీ నేతలు రంగంలోకి దిగుతారు. ఆ భూముల ధరను ఎకరా ఎక్కువ ధర నిర్ణయించేలా ఉన్నతాధికారులపై ఒత్తిడి చేస్తారు. ఇక అంతే అయిదు లక్షల భూమికి రూ. 25 లక్షల చొప్పున చెల్లింపులు జరిగిపోతాయి. ఇక్కడ రైతుకు ముట్టేది మాత్రం ఎకరాకు పది లక్షలే. అంటే ఒక్క ఎకరా కొనుగోలు లోనే రూ. 20 లక్షలు అనధికారికంగా చేతులు మారినట్టు.
ఉదాహరణకు : కొన్ని నియోజకవర్గాల్లో ఇలా…!!
* ఇలా కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో 243 ఎకరాల భూమి పేదల కోసం కొనుగోలు చేశారు. అంటే ఈ వ్యవహారంలో సుమారుగా రూ. 97 కోట్లు చేతులు మారినట్టు ఆరోపణ.
* ప్రకాశం జిల్లా కనిగిరిలోనూ 40 ఎకరాలకు పైగా ఇలాగే కొన్నారు. ఇక్కడ అధికారికంగా రూ. 7 లక్షలు ఉంటె, రూ. 30 లక్షలు చూపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఫిర్యాదుపై విచారణ జరుగుతుంది.
* ప్రకాశం జిల్లా కందుకూరులో పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఎకరా రూ.5 లక్షలు కూడా లేని భూమిని ప్రభుత్వానికి రూ. 40 లక్షలకు కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో కొందరు స్థానిక పెద్దలు చక్రతిప్పారని తెలుస్తోంది. ఇది పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది.
* నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఎకరం రూ. 8 లక్షలు చొప్పున 70 ఎకరాలను కొనుగోలు చేసారు. ప్రభుత్వానికి మాత్రం రూ. 50 లక్షలు ధర పెట్టారు. అక్కడి కూలీలు, వైట్ రేషన్ కార్డు ఉన్న కొందరు కూలీల పేరుతో ఒకే రోజు 70 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరగడంతో భూ భాగోతం వెలుగులోకి వచ్చింది. దీనికి తోడు కావలి పట్టణ సమీపంలోని ప్రభుత్వ భూములను కాదని 20 కిలోమీటర్ల దూరంలోని భూములు కొనుగోలు చేయడంతో వ్యవహారం బయటకు వచ్చింది. ఈ వ్యవహారంలో సహకరించలేనని నాటి కలెక్టర్ శేషగిరిబాబు బదిలీ అయిపోయారని జిల్లాలో వినిపిస్తున్న మాట.
* విజయవాడ రూరల్ నున్న గ్రామంలో అసలు వెళ్ళడానికి దారి లేని 40 ఎకరాల భూమిని ఎకరా రూ.70 లక్షలకు కొన్నారు. నున్నలోని సర్కారుతోటకు వెళ్లేందుకు కనీసం మట్టి రోడ్డు కూడా లేదు. అందుకే ధర బాగా తక్కువ. కానీ ఆ భూమిని అధికారులు రూ.70 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. ఈ అక్రమాలకూ అప్పటి విజయవాడ రూరల్ తహసీల్దార్ వనజాక్షి (చింతమనేని గొడవతో పాపులర్ అయినా వనజాక్షి) సహకరించకపోవడంతో ఆమెను బదిలీ చేయించారు.
ఆవ భూముల్లో ఎంత చెప్పినా తక్కువే..!!
తూర్పు గోదావరి జిల్లా ఆవ భూముల వ్యవహారం రాష్ట్రం మొత్తం తెలిసిందే. అసలు “ఆవ” అంటేనే ముంపు ప్రాంతమని అర్థం. అందుకు సాక్ష్యంగా ఇటీవల నడుం లోతు నీళ్లు అక్కడకు చేరాయి. సంవత్సరానికి రెండు, మూడు నెలల పాటు ఆ భూముల్లో 3 అడుగుల నుంచి పది అడుగుల మేర నీరు నిల్వ ఉంటుంది. ఆ భూములకు గరిష్టంగా ఎకరా రూ. పది లక్షలు కూడా లేదు. కానీ ప్రభుత్వం మాత్రం రూ. 52 లక్షలు నిర్ణయించి ఇచ్చేసింది. అక్కడితో ఆగకుండా మెరక చేయడానికి అంటూ ఎకరానికి రూ. 30 లక్షలు అంట..!! ఇలా ఆవ భూముల పేరిట దందా రాష్ట్రం మొత్తం పెద్ద వ్యవహారంగా మారింది.
జగన్ కి అందుకే తలనొప్పులు…!!
భూములు అంటే అందరికీ తెలుసు. వాటి ధర అందరికీ తెలుసు. ఈ అవినీతి దాగేది కాదు. కానీ పిల్లి కళ్ళుమూసుకుంటే ఎలుక అదేదో చేసినట్టు అధికారులు సహకారంతో కొన్ని నియోజకవర్గాల్లో నాయకులూ ఇలా బారి తెగించారు. అందుకే జగన్ కి తలనొప్పులు వచ్చాయి. పేదలకు మేలు చేయాల్సిన పథకం అమలుకు రావడం లేదు. జగన్ పదే పదే వాయిదాలు వేస్తూ వస్తున్నారు. కోర్టు వివాదాలు పేరిట కారణాలు చెప్పుకుంటున్నా.., లోలోపల ఈ ఆరోపణలు, అవినీతి వ్యవహారాలు, అధికార పార్టీపై మచ్చలు తగులుతున్నాయి. అందుకే దీనికి జగన్ స్థాయిలోనే పరిష్కారం చూపే ప్రణాళికలు తయారవుతున్నాయట.