అమరావతి, ఫిబ్రవరి 10 : విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి కేంద్రం విడుదల చేసిన నిధులు ఎంత అన్న విషయం స్పష్టత లేకుండా పోయింది.
‘పత్యేక హోదాతో సహా విభజన హామీలను నెరవేర్చడం లేదనీ, రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా, నిరంకుశంగా కేంద్రం వ్యవహరిస్తుందని’ ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే కేంద్రంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.
గురువారం గుంటూరులో జరిగిన సభలో ప్రధాని మోదీ తన ప్రసంగంలో చంద్రబాబు అసత్యాలు, అబద్దాలు చెబుతున్నారనీ, కేంద్రం ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువే నిధులు ఇస్తున్నామనీ చెబుతూ ఈ 55 నెలల కాలంలో వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా మూడు లక్షల కోట్లు ఆంధ్రప్రదేశేకు కేటాయించామని చెప్పుకొచ్చారు.
ఈ నెల నాలుగున శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా తన ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శిస్తూ..పలు కేంద్రం సంస్థలను నెలకొల్పడంతో పాటు ఆంధ్రకు అయిదున్నర వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చామని వెల్లడించారు.
గత నెల 21న విజయవాడలో కేంద్ర మంత్రి, బిజెపి సినియర్ నేత నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నా, నిధులు ఇవ్వడం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ఆయన ఒక అడుగు ముందుకు వేసి మరీ లెక్కలతో సహా కేంద్రం ఎంత ఇచ్చిందో చెబుతూ, దేశంలోని ఏ స్వతంత్ర సంస్థతో అయినా ఆడిట్ చేయించుకోవచ్చు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్ విసిరారు.
మోది హయాంలో గడచిన నాలుగేళ్లు ఆంధ్రప్రదేశ్కు స్వర్ణయుగమని కూడా గడ్కరీ అభివర్ణించారు.
‘సేతు భారత్ కింద 2,500కోట్ల రూపాయల వ్యయంతో 31ఆర్ఒబిలను ఆమోదించాం, 1,310కోట్ల రూపాయల వ్యయం అయ్యే 15ఆర్ఒబిలను మంజూరు చేశాం, సాగరమాల కింద విశాఖ నుండి మొదలు పెట్టి చేపట్టే పోర్టు ఆధారిత అభివృద్ధిలో భాగంగా 1,64లక్షల కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో 108 ప్రాజెక్టులు గుర్తించాం, రూ.33,042కోట్లతో 53 ప్రాజెక్టులు 2020నాటికి పూర్తి అవుతాయి, రూ.2,242 కోట్ల వ్యయంతో 19 ప్రాజెక్టులను గత అక్టోబర్లోనే పూర్తి చేశాం, ఇవి కాక రూ.83,713కోట్లతో అదనంగా 27 ప్రాజెక్టులను నిర్మించతలపెట్టాం’ అని గడ్కరీ తెలియజేశారు.
గడ్కరీ చెప్పిన ప్రాజెక్టుల లెక్కలు చూస్తే సుమారు రెండు లక్షల 90వేల కోట్లుగా కనబడుతున్నది.
కేంద్ర మంత్రి గడ్కరీ, ప్రధాని మోది చెప్పిన లెక్కలు మూడు లక్షల కోట్లు కుడి ఎడమగా సరిపోతుండగా, బిజిపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏకంగా అయిదున్నర వేల కోట్లు కేంద్రం ఇచ్చిందంటూ ప్రకటన చేయడం కాకిలెక్కలను తలపిస్తుందని పలువురు విమర్శిస్తున్నారు.