ఏపీ పాలిటిక్స్ లో జగన్ తన మార్క్ చూపించేందుకు పెద్ద పెద్ద అడుగులే వేస్తున్నారు. ఇందులో ఒక భాగమే ‘అముల్’ డెయిరీ. రాష్ట్రంలో ఇప్పటికే పలు అగ్రగామి డెయిరీలు ఉన్నాయి. విజయ, సంగం, మోడల్.. అన్నింటికీ మించి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ ఉన్నాయి. అయితే.. సహకార రంగాన్ని పరుగులు పెట్టించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. అందులో భాగంగానే ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉన్న ‘అమూల్’ ను రాష్ట్రానికి తీసుకొచ్చామని అన్నారు. అయితే.. తమను వదిలేసి ఎక్కడో గుజరాత్ నుంచి ‘అమూల్’ ని తీసుకురావడంపై వీరంతా ఆగ్రహంగా ఉన్నారు. సీఎం జగన్ చెప్పినట్టు ‘అమూల్’ అదనంగా 5 నుంచి 7 రూపాయలు ఇచ్చే అవకాశం లేదని సంగం డెయిరీ అంటూండటం పోటీని హీటెక్కిస్తోంది.
మేమే ఎక్కువిస్తున్నాం..
అమూల్ కు వచ్చే లాభాల్లో ఏటా రెండు సార్లు మహిళలకే బోనస్ గా ఇస్తారని అంటోంది. ఇదంతా అబద్దమని సంగం డెయిరీ పాలకమండలి అంటోంది. పాలసేకరణలో డెయిరీలు చెల్లించే ధర ఇంచుమించు పైసల్లోనే తేడాలు ఉంటాయి. అమూల్ ఇస్తామనే దానికంటే పది పైసలు ఎక్కువే ఇస్తాం అని కూడా అంటోంది. 6శాతం వెన్న ఉండే గేదె పాలకు 46.83 తాము చెల్లిస్తున్నామని.. అమూల్ 45.48 మాత్రమే చెల్లిస్తోందనీ అంటున్నారు. పశువైద్యానికి ఏటా 3 కోట్లు, పాడి రైతులకు ఉచిత ఇన్సూరెన్స్ కల్పిస్తోంది సంగం. అమూల్ ఎక్కువ ధర చెల్లిస్తుందని సీఎం చెప్పడం అబద్ధం అంటున్నారు.
ప్రభుత్వం ఉద్దేశం ఏంటో..
గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు మిగిలిన డెయిరీల కంటే సొంత సంస్థ హెరిటేజ్ ను మాత్రమే ప్రోత్సహించారనే పేరు పడ్డారు. సహకార రంగాన్ని పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలూ ఎదుర్కొన్నారు. ఇప్పుడు జగన్ సీఎం అయ్యారు. ‘అమూల్’ ని తీసుకొచ్చారు. ప్రభుత్వం నిర్మించిన రైతు భరోసా కేంద్రాలను అమూల్ కు ఇస్తోంది. పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్తోంది. ఇదంతా చంద్రబాబు హెరిటేజ్ కు పోటీగా నిలబెట్టేందుకే అని చెప్పకపోయినా అర్ధమయ్యే విషయమే. మరి రాష్ట్రంలో లాభాల్లో ఉన్న విజయ, సంగం, మోడల్.. వంటి డెయిరీలకు ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందా.. లేక పోటీ పెరుగుతుందా.. ఏకఛత్రాధిపత్యాన్ని తగ్గించడానికా.. అనేది చూడాల్సిందే..!