అమరావతి:ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం పాలయిన నేపథ్యంలో అనంతపురం జిల్లా సీనియర్ నేత జెసి దివాకరరెడ్డి రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సోమవారం ఒక న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రధాని మోదితో జగన్ వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రానికి శుభ పరిణామం అని జెసి వ్యాఖ్యానించారు. జగన్పై రాజకీయ విమర్శలు చేశాను తప్ప ఎప్పుడూ ద్వేషించలేదనీ, మావాడనే అభిప్రాయం ఎప్పుడూ ఉందని జెసి అన్నారు.
జగన్ తండ్రి వైఎస్ తనకు చాలా సహాయకారిగా ఉండేవారని తెలియజేస్తూ ఆయన మృతి చెందడానికి ఒక రోజు ముందు తనను పిలిపించి మాట్లాడారనీ, హైకమాండ్తో అనుమతి తీసుకువచ్చాననీ, చిత్తూరు పర్యటన నుండి రాగానే తనను, జానారెడ్డిని మంత్రివర్గంలో తీసుకుంటానని వైఎస్ చెప్పారని జెసి అన్నారు.
తమ ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత సంబంధాల విషయంలో తేడా లేదని జెసి వెల్లడించారు.
‘30-35సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా కొన్ని పొరబాట్లు జరిగి ఉంటాయి, కొన్ని మంచి పనులు జరిగి ఉంటాయి, కానీ కక్ష సాధింపుగా ఎవరికి హాని చేయలేదు’ అని జెసి అన్నారు.
‘నా తండ్రి సంజీవరెడ్డి స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చా, నేడు రాజకీయాల్లో ఆ స్పూర్తి కొనసాగే అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. అందుకే ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నా’ అని జెసి వెల్లడించారు.
రాజకీయ వాతావరణం రోజురోజుకు దిగజారిపోతోందని జెసి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు మారాలనీ, ఎన్నికల సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని జెసి అన్నారు.